Tummala | హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): విత్తన కంపెనీల లైసెన్స్లను సమగ్రంగా పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న కంపెనీల లైసెన్స్లను రద్దు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఆయా కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల మాట వినిపించొద్దని, ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహించి సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇక యాసంగి సీజన్తో పాటు రాబోయే వానకాలం సీజన్కు అవసరమైన నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో విత్తనరంగ అభివృద్దిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణలోని కంపెనీలు ఇక్కడి రైతుల అవసరాలు తీర్చిన తర్వాతే ఎగుమతి చేసుకోవాలన్నారు. ప్రైవేటు విత్తన కంపెనీలకు ధీటుగా ప్రభుత్వ విత్తనాభివృద్ది సంస్థను, విత్తన దృవీకరణ సంస్థ ద్వారా విత్తనాలు ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటు ఉంచాలన్నారు.
తెలంగాణ విత్తనరంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న ప్రైవేటు విత్తన కంపెనీల ప్రతినిధులు మంత్రి తుమ్మలకు పలు విజ్ఞప్తులు చేశారు. విత్తనాలకు మార్కెట్ సెస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అదే విధంగా విత్తన రైతులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్తో పాటు విత్తన పంట బీమాను అందుబాటులోకి తీసుకొచ్చి విత్తనోత్పత్తి పెంచేందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, డైరెక్టర్ గోపి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, నూజివీడు సీడ్స్ ఎండీ ప్రభాకర్రావు, కావేరీ సీడ్స్ ఎండీ భాస్కర్రావు, రాశీ సీడ్స్ సీవోవో ఏఎస్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.