హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు, టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉప సంఘానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చైర్మన్గా కొనసాగనున్నారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉండనున్నారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ ప్రగతి భవన్లో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్ధత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాలపై కేబినెట్ సమీక్షించింది. కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు, మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని అధికారులు కేబినెట్కు వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని దవాఖానాల్లోని పరిస్థితులను సమీక్షించి, అన్ని రకాల మందులు, టీకాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకొని ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేబినెట్ ఆర్యోగశాఖను ఆదేశించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, అందుకు మంత్రులందరూ వారి వారి జిల్లాల్లో సమీక్షించాలని, అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.