హైదరాబాద్ : రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని కోరుతూ కేబినెట్కు పంపాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వం విద్యా సంస్థల్లో ఆంగ్ల మాధ్యమం బోధనకు చేపట్టాల్సిన విధివిధానాలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై ఏర్పడిన మంత్రివర్గ ఉప సంఘం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన బుధవారం జరగ్గా.. కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే విధివిధానాలను రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఆంగ్ల మాధ్యమానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆంగ్ల మాధ్యమంలో చేరే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా బైలింగువల్ విధానంలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను ముద్రించాలని సూచించింది. ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని అధికారులను మంత్రి వర్గ ఉప సంఘం అదేశించింది. విద్యార్థులకు ఆంగ్లంలో ప్రత్యేక మెళకువలను నేర్పేందుకు అవసరమైతే టీ-సాట్ ద్వారా ప్రత్యేక కోర్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో డిజిటల్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నందున ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది.
ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా భవిష్యత్లో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం తల్లి దండ్రుల ఆశయాలను, ఆకాంక్షలను సాకారం చేసే నిర్ణయంగా భావించాలని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై మంత్రి వర్గ ఉప సంఘం విస్తృత స్థాయిలో చర్చించింది. ఈ విషయంలో మరొక సారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని కమిటీ
అభిప్రాయపడింది. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క్రిస్టినా జెడ్ చొంగ్తు, దివ్య, ఉమర్ జలిల్, దేవసేన తదితరులు పాల్గొన్నారు.