హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు కాలేజీలవారీగా వివరాలను సేకరిస్తున్నారు. ఇంటర్ విద్య కమిషనరేట్ పరిధిలో మొత్తం 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిల్లో తెలుగు, ఇంగిష్, ఉర్దూ మీడియాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఇంగ్లిష్ మీడియం కాలేజీలు ఐదు మాత్రమే ఉన్నాయి. తెలుగుకు సమాంతరంగా ఇంగ్లిష్ మీడియం కొనసాగుతున్న కాలేజీలు 334 ఉన్నాయి. పలు కాలేజీల్లో సైన్స్, మరికొన్ని కాలేజీల్లో ఆర్ట్స్ సెక్షన్లను ఇంగ్లిష్ మీడియంలో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే అన్ని సెక్షన్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు సేకరించి, క్యాబినెట్ సబ్ కమిటీ ముందు ఉంచుతామని ఓ అధికారి తెలిపారు.
21న క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ
ఇంగ్లిష్ మీడియం పాలసీ రూపకల్పన, ఫీజు నియంత్రణ చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 21న భేటీ కానున్నది. 15 మంది మంత్రులతో ఈ సబ్కమిటీ.. వచ్చేసోమవారం జూబ్లీహిల్స్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమావేశం కానున్నది. ఈ సమావేశానికి ఇంటర్ విద్య అధికారులు సైతం హాజరుకావాలని ఆదేశించారు.