రైతులు ఎంత ధాన్యం పండించినా రూ.500 బోనస్ ఇచ్చి మరీ కొంటం’.. ఇదీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ. గ్యారెంటీల జాబితాలోనూ దాన్ని చేర్చింది. అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ తాజాగా ప్రకటించి.. మెజార్టీ రైతులకు మొండిచెయ్యి చూపించింది.
Telangana | హైదరాబాద్, మే 20(నమస్తే తెలంగాణ): వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ అంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ బోగస్ అని తేలిపోయింది. బోనస్ అందరికీ కాదని, సన్నవడ్లకు మాత్రమేనంటూ తాజాగా ప్రకటించి దొడ్డురకం వడ్లు పండించే రైతులకు ధోకా ఇచ్చింది. అది కూడా రానున్న వానకాలం సీజన్ నుంచి మాత్రమేనని తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోను, పార్టీ మ్యానిఫెస్టోలోనూ ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పారు తప్పితే సన్నవడ్లు అని పొరపాటున కూడా ఎక్కడా చెప్పలేదు. ఇప్పడేమో తీరిగ్గా సన్నవడ్లకే ఇస్తామని ప్రకటించడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
90 శాతం రైతులకు మొండిచెయ్యి
రాష్ట్రంలో సన్నవరి పండించేది అతికొద్దిమందే. వానకాలంలో 30-35శాతం మంది పండిస్తే, యాసంగిలో అది 10-15 శాతానికి పరిమితమవుతుంది. అదే సమయంలో దొడ్డు రకం వరి వానకాలంలో 70 శాతం, యాసంగిలో 90 శాతం సాగవుతున్నది. అలాంటిది మెజార్టీ రైతులు పండించే వడ్లకు కాదని, అతి తక్కువమంది పండించే సన్నవడ్లకు బోనస్ ఇస్తామనడంపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
మార్కెట్లో సన్నాలకే డిమాండ్
దొడ్డురకం ధాన్యంతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో సన్నవరికే డిమాండ్ అధికం. ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీపడి కల్లాల వద్దకు వచ్చి మరీ కొంటారు. ఫలితంగా మద్దతు ధరకు మించి రూ. 500-700 వరకు అదనంగా లభిస్తుంది. కాబట్టి వాస్తవంగా చెప్పుకోవాలంటే సన్నాలకు బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వానకాలం సాగయ్యే పంటలో 20-25 శాతాన్ని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తే పదిశాతం ధాన్యాన్ని రైతులు తమ అవసరాల కోసం దాచుకుంటారు. మిగిలిన 5-10 శాతం ధాన్యాన్ని మార్కెట్లో విక్రయిస్తారు. కాబట్టి కొనుగోలు కేంద్రాలకు వచ్చేది సెకండ్ గ్రేడ్ సన్నాలే. అలాంటప్పుడు కొనుగోలు కేంద్రాలకు రాని వడ్లకు బోనస్ ఎలా ఇస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బోనస్ ఇస్తేగిస్తే డిమాండ్ లేని దొడ్డువరికి ఇవ్వాలని కానీ, ఇదెక్కడి అన్యాయమంటూ రైతులు మండిపడుతున్నారు.
సన్నాల్లోనూ మళ్లీ మెలిక
సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందులోనూ మరో మెలిక పెట్టింది. అన్ని రకాల సన్నాలకు బోనస్ ఇవ్వబోమని, వ్యవసాయశాఖ సూచించిన సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ సన్నరకాల జాబితాను వ్యవసాయశాఖ త్వరలోనే వెల్లడిస్తుందని పేర్కొన్నారు. రైతుల్లో ఇది మరింత గందరగోళానికి కారణమైంది. వ్యవసాయశాఖ పేర్కొన్న జాబితాలో లేని సన్నాలను సాగుచేసే రైతుల పరిస్థితి ఏంటన్నది అంతపట్టడం లేదు.
రైతులకు ఏటా 6 వేల కోట్ల నష్టం
సన్నాలకు బోనస్ అన్న ప్రభుత్వ ప్రకటనతో రైతులు భారీగా నష్టపోనున్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 1.20 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి ఎక్కువైతే అది 1.50 కోట్ల టన్నులు కూడా ఉండే అవకాశం ఉన్నది. ఇందులో 97 శాతం దొడ్డరకం ధాన్యమే ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే టన్నుకు రూ. 500 బోనస్ చొప్పున 1.20 కోట్ల టన్నులకు రూ. 6 వేల కోట్ల వరకు రైతులు నష్టపోయే అవకాశమున్నది. అదే సమయంలో ప్రభుత్వానికి ఆ మేరకు భారం కూడా తగ్గుతుంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఇప్పుడు సన్నబియ్యం పల్లవి అందుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదాయం సమకూర్చుకోలేక నానా తంటాలు పడుతున్న ప్రభుత్వం ఆర్థిక కష్టాలను ఏదోలా తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే సన్నవడ్ల జపం చేస్తున్నట్టు చెప్తున్నారు.
కాంగ్రెస్పై రైతులు గరం గరం
సన్నవడ్లకు బోనస్ ప్రకటనపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ పేరుతో ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేసిందని మండిపడుతున్నారు. ధాన్యానికి బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఓట్లు దండుకొని ఇప్పుడు సన్నవడ్లకే అని చెప్పడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమలు చేతకానప్పుడు హామీ ఇవ్వడం ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.