హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మించి ఉన్న నేపథ్యంలో వాటి అమలుపై క్యాబినెట్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమైనట్టు సమాచారం. గురువారం అసెంబ్లీ హాల్లో క్యాబినెట్ సమావేశం జరిగింది. వాస్తవానికి గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపే సమావేశం సాధారణంగా అరగంటలో అయిపోతుంది. కానీ.. గురువారం దాదాపు గంటన్నరపాటు సాగింది. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీల అమలుకు అయ్యే ఖర్చులపై మంత్రివర్గం లెక్కలు వేసినట్టు సమాచారం. అన్నీ అమలు కావాలంటే ప్రస్తుత బడ్జెట్ కంటే మూడింతల నిధులు కావాలని తేలినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పథకాల అమలులో కొర్రీలు పెట్టాలని కొందరు సూచించినట్టు సమాచారం. రైతుబంధు 5 ఎకరాల లోపువారికే ఇవ్వాలని, మహాలక్ష్మి పథకంలోనూ కోతలు పెట్టాలని, బస్సుల సంఖ్య తగ్గించి నష్టాన్ని నివారించాలని సూచనలు వచ్చినట్టు తెలిసింది. అయితే అందరికీ, అన్నీ ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు కొర్రీలు పెట్టడం కరెక్ట్ కాదని ఇద్దరు, ముగ్గురు మంత్రులు సూచించినట్టు సమాచారం. లెకలు వేసుకోకుండా ఎన్నికల్లో హామీలు ఎందుకు ఇచ్చారని ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ వాదన కాస్త సీరియస్గా సాగుతుండటంతో మరో మంత్రి కలుగజేసుకుని శాంతిపజేసినట్టు చెప్పుకుంటున్నారు. సమావేశం రసాభాస అయ్యే సూచనలు ఉండటంతో మ్యానిఫెస్టో హామీలు, ఆరు గ్యారెంటీలపై చర్చను అర్ధంతరంగా ముగింపు పలికినట్టు తెలిసింది.