హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసనమండలి, శాసన సభ సమావేశాలు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్ విడుదల చేశారు. గత సమావేశాలు ప్రొరోగ్ కాకపోవడం గమనార్హం. ఆరోతేదీన శాసన సభ స్పీకర్ అధ్యక్షతన జరిగే శాసనసభ నిర్వహణ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకొంటారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతున్నది. మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి. భారత్లో తెలంగాణ విలీనమై 74 ఏండ్లు పూర్తయ్యి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణ, పోడుభూముల సమస్య పరిష్కారం తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశమున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా తెలంగాణపై ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో అదనపు వనరుల సమీకరణపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. మహిళా యూనివర్సిటీ, సాగునీటి పారుదల రంగానికి చెందిన అంశాలు, ఉద్యోగులకు డీఏ పెంపు తదితర అంశాలపై క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.