హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమయింది. రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. నియోజకవర్గంలోని హుజూరాబాద్, వీణవంక, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్ జరగుతుంది. మొత్తం 106 గ్రామపంచాయతీల్లో 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,36,283 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,18,720 మంది పురుష ఓటర్లు, 1,17,563 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉన్నది. నవంబర్ 2న ఓట్లను లెక్కించనున్నారు.
పోలింగ్కు అంతరాయం లేకుండా విద్యుత్తోపాటు సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 1715 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 107 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 3865 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓటర్లు తప్పకుండా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ఎన్నికల అధికారి సూచించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్లో 84.5 శాతం పోలింగ్ నమోదయిందని చెప్పారు.