‘నాన్నా లెవ్వు.. ఇంటికిపోదాం. రత్తం వొస్తుంది. నొప్పయితుంది.. లే నాన్నా.. ఆకలేస్తుంది’ నడిరోడ్డుపై తండ్రి మృతదేహం వద్ద రెండేండ్ల కొడుకు రోదన ఇది. కొడుకు ఆకలి తీర్చడం కోసం పాల ప్యాకెట్ తెచ్చేందుకు బాబుతో కలిసి బయటకు వచ్చిన తండ్రిని డీసీఎం రూపంలో మృత్యువు కబళించింది. ఆ పసివాడి కండ్ల ముందే తల్లడిల్లి తండ్రి కన్నుమూశాడు. నాన్న లేడని, పలకలేడనీ తెలియని ఆ పసివాడు రక్తపుమడుగులో తండ్రి మృతదేహాన్ని చూస్తూ రోదించడం అక్కడున్న అందరినీ కలచివేసింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా విజయవాడ జాతీయ రహదారిపై ఇనామ్గూడ కమాన్ దగ్గర గురువారం ఉదయం చోటుచేసుకున్నది.
Hyderabad | పెద్దఅంబర్పేట, మే 30 : పాల ప్యాకెట్ తీసుకొచ్చేందుకు కుమారుడిని వెంట బెట్టుకొచ్చిన తండ్రిని డీసీఎం రూపంలో మృత్యువు వెంటాడింది. ఆ పసివాడి కండ్ల ముందే తల్లడిల్లి తండ్రి చనిపోయాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయవాడ జాతీయ రహదారిపై ఇనామ్గూడ కమాన్ దగ్గర గురువారం ఉదయం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని పసివేదుల గ్రామానికి చెందిన శెట్టి కనకప్రసాద్ (30)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో రెండేండ్ల శివకుమార్ పెద్దవాడు. చిన్నవాడి వయసు ఆరునెలలే. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనోపాధి పొందుతున్న కనకప్రసాద్ మూడునెలల కిందట అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ఇనామ్గూడకు వచ్చాడు.
తల్లి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఇక్కడే నివసిస్తున్నాడు. గురువారం ఉదయం ఇంట్లో కుటుంబసభ్యుల కోసం టిఫిన్లు, పిల్లలకు పాల ప్యాకెట్లు తీసుకొచ్చేందుకు కనకప్రసాద్ తన రెండేండ్ల కొడుకు శివకుమార్తో కలిసి బైక్పై బయలుదేరాడు. విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న అబ్దుల్లాపూర్మెట్ చౌరస్తాలో టిఫిన్లు, పాల ప్యాకెట్లు తీసుకుని, తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఇనామ్గూడ కమాన్ ఎదురుగా యూటర్న్ తీసుకుంటుండగా.. అదే సమయంలో వెనకనుంచి అతివేగంగా వచ్చిన డీసీఎం వీరి బైక్ను ఢీకొట్టింది. కనకప్రసాద్తో పాటు కొడుకు శివకుమార్ రోడ్డుపై పడిపోయారు. కనకప్రసాద్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. శివకుమార్కు సైతం గాయాలయ్యాయి. కండ్ల ముందే తండ్రి విగతజీవిగా పడి ఉండగా.. ‘నాన్నా లే.. ఇంటికి పోదాం.. ఆకలేస్తుంది’ అంటూ చిన్నారి చేసిన రోదనలు అటుగా వెళ్తున్న వారిని కంటతడిపెట్టించాయి. తండ్రి లేచి ఎత్తుకోలేడన్న విషయాన్ని సైతం తెలియని పసిహృదయం.. మృతదేహాన్ని చూస్తూ ఏడ్వడం అక్కడ విషాదాన్ని నింపింది. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. చిన్నారికి వైద్యం అందించే ప్రయత్నం చేశారు. నిర్లక్ష్యంగా డీసీఎం నడిపి, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.