గోల్నాక, ఫిబ్రవరి 24 : అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొన్నది. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితాకృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. బాపునగర్ కాకతీయ బజార్కు చెందిన రామ్రాజ్(55), ఆయన భార్య మాధవి(52), కుమారుడు శశాంక్(24) మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా మాధవి ఆత్మహత్యకు పాల్పడగా, అదే గదిలో భర్త రామ్రాజ్ ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఆ తర్వాత కుమారుడు శశాంక్.. చేతి మణికట్టును కత్తితో కట్ చేసుకోవడంతో తీవ్ర రక్తస్రావం కాగా, అది కుదరకపోవడంతో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆర్థికభారంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. రామ్రాజ్ మూడేండ్లుగా రామంతాపూర్లో హోటల్ నిర్వహిస్తున్నాడు. పార్ట్నర్స్తో విభేదాల కారణంగా కొద్దికాలం క్రితం తన వాటాతో పక్కకు తప్పుకొన్నాడు. అనంతరం నగరంలోని చక్రిపురంలో మరో హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో నష్టాలతో రామ్రాజ్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.