హైదరాబాద్, అక్టోబర్ ౧౩ (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మూడు రోజులకే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకు ఉపక్రమించింది. ఏకంగా ౨౦ మంది బ్యూరోక్రాట్లపై బదిలీ వేటు వేసింది. ఈ నెల ౯వ తేదీన ఎన్నికల షెడ్యూల్ రాగా.. ౧౧వ తేదీనే కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర చర్యలకు దిగింది.
ఎన్నికలకు ముందు బదిలీలు సాధారణమే. అయితే.. బదిలీలు జరుగుతున్న తీరుపైనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం తమ విశ్వసనీయతను శంకించడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నదని వాపోతున్నారు. ౨౦ మందిపై బదిలీ వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం అందులో ౧౮ మందికి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశించింది. బదిలీతోపాటు శాసనసభ ఎన్నికల్లో వారి సేవలను వినియోగించరాదని ఈసీ ఆదేశించడంపై అధికారులు మనోవేదనకు గురైనట్టు తెలుస్తున్నది.
ఈ పరిణామాలు తమ కెరీర్లో రిమార్కుగా ఉండిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే.. తన బదిలీపై మరో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్పందిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించే నాటికి తాను ఒక శాఖలో బాధతలు చేపట్టి ముడు రోజులే అయిందని.. అలాంటప్పుడు ఆ శాఖ పనితీరుకు తననెలా బాధ్యురాలిని చేస్తారని ట్విట్టర్(ఎక్స్) వేదికగా ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికీ.. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు హాట్ టాపిక్గా మారాయి. కేంద్ర ఎన్నికల సంఘం ౨౦ మందిని బదిలీ చేయగా, ఆ స్థానాల్లో మరో ౨౦ మంది అధికారులను నియమించాలి. మొత్తంగా.. రాష్ట్రంలోని ౪౦ మంది, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీల ప్రభావం పడుతున్నది.