పది పదిహేనేండ్ల క్రితం పిల్లల పెంపకాన్ని ఎవరూ పెద్దభారంగా భావించేవారు కాదు. అంతకుముందు రోజుల్లో అర డజను మంది పిల్లలను సైతం ఉల్లాసంగా, ఉత్సాహంగా పెంచేవారు. దేవుడు ఇచ్చిన పిల్లలను కాదని కూడదన్న సెంటిమెంట్తో ఎంతమందినైనా కనేవారు. కాన్పు ఆలస్యమైతే దేవుళ్లకు మొక్కేవారు! కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. దేవుడా..! అప్పుడే మాకు పిల్లలొద్దు.. ఒకరిని మించి పెంచలేం. చదివించలేం.. అనే రోజులొచ్చాయి. పిల్లల పెంపకం ఇప్పుడు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. తమ సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువులకే ధారపోయాల్సిన దుస్థితి. ఇక ఏదైనా అనారోగ్యం సంభవిస్తే.. ఆ కుటుంబం పరిస్థితి దయనీయం. బతుకు దుర్భరం.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కనీసం ఒక్క సంతానాన్ని కనాలన్నా భయపడాల్సిన రోజులొచ్చాయి. పిల్లల పెంపకం, వైద్యం, చదువులు చెప్పించడం.. తదితర ఖర్చులు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. సగటు మధ్యతరగతి కుటుంబాలు పొందుతున్న ఆదాయానికి పిల్లల భవిష్యత్తు కోసం పెట్టాల్సిన ఖర్చులకు పొంతన లేకుండా పోతున్నది. అత్యధిక శాతం కుటుంబాలకు వార్షిక ఆదాయాల్లో వృద్ధి అత్యంత కనిష్ఠ స్థాయికి, ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకొంటే ఒక్కొక్కసారి మైనస్లోకి పడిపోతుంటే.. పాఠశాల ఫీజులు మాత్రం ఏటేటా 10-15 శాతం వరకు పెరుగుతూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నాయి. వేతనాలు చాలక ప్రతినెలా ఎంతో కొంత అప్పు చేస్తున్న చిరుద్యోగులు మనమధ్య చాలామందే ఉన్నారు. ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం పుట్టిన నాటి నుంచి మూడేండ్లు నిండే వరకు పెట్టే ఖర్చు రూ.పదకొండున్నర లక్షలకు వరకు ఉంటున్నది. 14-17 ఏండ్ల వయస్సులో రూ.25.58 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తున్నదని అంచనా. ఒకటి నుంచి పది తరోగతి పూర్తయ్యే లోగా ఫీజుల రూపంలోనే ఒక్కొక్క కుటుంబం సగటున రూ.10 లక్షల వరకు ధారపోయాల్సి వస్తున్నది. ఈ లెక్కన పిల్లల పెంపంకం, విద్యాబుద్ధులు నేర్పించడం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతున్నది. దీంతో ఎక్కువ శాతం మంది ఒకే బిడ్డతో సరిపుచ్చుకొనేందుకు మొగ్గు చూపుతున్నారు. మరికొన్ని నవ జంటలు పిల్లలను కనడాన్ని వాయిదా వేసుకొంటున్నాయి.
ద్రవ్యోల్బణం ప్రభావం
ద్రవ్యోల్బణం ప్రభావం అన్ని రంగాలపై పడుతున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో అన్నింటి రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. దీంతో పిల్లల పెంపకం ఖర్చులు సైతం అమాంతం పెరిగినట్టుగా అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి.
తెలంగాణలో తక్కువే
ఫీజుల భారం నుంచి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకొంటున్నది. ముఖ్యంగా ఇంజినీరింగ్ సహా వృత్తివిద్యా కోర్సుల ఫీజులను ప్రభుత్వమే ఖరారుచేస్తున్నది. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) సిఫారసుల ప్రకారం నిర్దిష్ట ఫీజులను అమలుచేస్తున్నది. మన దగ్గర ఇంజినీరింగ్ గరిష్ఠ ఫీజు 1.34 లక్షలు కాగా, కనిష్ఠ ఫీజు రూ.35 వేలు మాత్రమే. ఈ ఏడాది ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యాకోర్సుల ఫీజులు పెంచాల్సి ఉన్నప్పటికీ కరోనా పరిస్థితుల కారణంగా పెంచలేదు. మిగతా వృత్తి విద్యాకోర్సులు సైతం రూ.20 వేల లోపే ఉన్నాయి. తెలంగాణ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం ఉచితంగానే నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ఆయా సంస్థల్లో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు ఉచితంగానే చదువుకొంటున్నారు. ఒక్కొక్క విద్యార్థిపై ప్రభుత్వమే ఏటా రూ.1.25 లక్షలు ఖర్చుచేస్తున్నది. ఇంటర్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, డిగ్రీ, వృత్తివిద్యాకోర్సుల్లోని విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ అమలుచేస్తుండటంతో ఫీజుల ప్రభావం తల్లిదండ్రులపై అంతగా ఉండటం లేదు. పాఠశాల స్థాయిలో 57 లక్షల విద్యార్థుల్లో 25 లక్షల మంది, ఇంటర్లో 9 లక్షల విద్యార్థుల్లో 2 లక్షల మంది ప్రభుత్వ సంస్థల్లో చదువుకొంటున్నారు.
పిల్లలు పుట్టినప్పుడే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
పిల్లల పెంపకం వ్య యం గణనీయంగా పె రగడానికి ద్రవ్యోల్బ ణం పెరుగుదల, జీడీపీ తగ్గుదల వంటి పరిణామాలు కూడా కారణమే. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం పరోక్షంగా అన్నింటిపై పడుతుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా పుస్తకాల నుంచి స్కూల్ డ్రెస్ వరకూ అన్నీ ఆకాశాన్నంటాయి. పిల్లలు పుట్టినప్పటి నుంచే వారికి 25 ఏండ్లు వచ్చేవరకు అవసరమైన ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఎడ్యుకేషన్ స్కీమ్ల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఖర్చులను పరిమితిలో ఉంచుకోవాలి.
– పడమట మోహన్,సీనియర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్
చదువుల ఖర్చులు ఇలా..
పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చుల్లో ప్రధాన వాటా చదువులదే. తాజా అంచనాల ప్రకారం తమ పిల్లలను ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివించే తల్లితండ్రులు 1-10 తరగతులు పూర్తయ్యే సరికి ఎంతలేదన్నా రూ.10 లక్షలు కేవలం ఫీజులు, పుస్తకాల కోసమే ఖర్చుచేయాల్సి వస్తున్నది. అంటే ఏడాదికి రూ.1లక్ష వరకు ఖర్చుచేస్తున్నారు. ఇక ఉన్నత విద్య పూర్తయ్యే సరికి ఈ మొత్తం రూ.కోటికి చేరుతున్నది. ఇండ్లు కట్టి చూడు.. పెండ్లి చూసి చూడు అన్నట్టుగా రాబోయే రోజుల్లో ప్రైవేట్ స్కూళ్లలో చదివించి చూడు.. అని చెప్పుకోవాల్సి వస్తుందేమో!
ఎడ్యు ఫండ్ సంస్థ అంచనాల ప్రకారం 2012-20 మధ్య కాలంలో అన్ని రకాల ఫీజులు 10-12 శాతం చొప్పున పెరిగా యి. ట్యూషన్ ఫీజులు, ట్రాన్స్పోర్టేషన్ ఫీ జులు, పరీక్షల ఫీజులు భారీగా పెరిగాయి.
అడ్మిషన్ ఫీజు ఆల్టైమ్ రికార్డుకు చేరింది. టైర్-1 నగరాల్లోని ఒక మోస్తరు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇది రూ.25 వేల నుంచి రూ.75 వేలు మధ్య ఉన్నది.
టైర్-1, 2 నగరాల్లో ట్యూషన్ ఫీజు రూ. 60 వేల నుంచి రూ.1.5 లక్షలకు చేరింది.
ప్రైమరీ స్కూళ్లల్లో ట్యూషన్ ఫీజు రూ. 1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షల దాకా ఉన్నది. అంటే ఏడేండ్లకు సరాసరిగా రూ. 5.5 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తున్నది.
సెకండరీ స్కూళ్లల్లో ఏడాది ఫీజు రూ.1.6 లక్షల నుంచి రూ.1.87 లక్షలు ఉండగా, మొత్తంగా పాఠశాల విద్య పూర్తయ్యే వరకు రూ.9.5 లక్షలు వెచ్చించాల్సి వస్తున్నది.
తమ పిల్లలను డే కేర్ సెంటర్లకు పంపే తల్లిదండ్రులు ఏటా రూ.2 లక్షల దాకా ఖర్చు పెట్టక తప్పడం లేదు.
పాఠశాల స్థాయిలో పుస్తకాల కోసమే రూ.4 వేల-రూ.7 వేలు వెచ్చించాల్సి వస్తున్నది. జూనియర్ కళాశాలల్లో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటున్నది. కొ న్ని కార్పొరేట్ కాలేజీలు యాప్ల పేరుతో మరో నాలుగైదు వేలు బాదేస్తున్నాయి.
స్కూల్ ఆటోలు, స్కూలు బస్సులకు నెలకు కనిష్ఠంగా రూ.1,500-2,000 చొప్పున వెచ్చించాల్సిన పరిస్థితి.
జేఈఈ, నీట్ వంటి కోచింగ్ ఫీజులు రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉన్నాయి.
కళాశాల విద్యలో బీటెక్, బీఎస్సీ కోర్సుల ఫీజులు రూ.4.20 లక్షలు దాటిపోయాయి.
ఐఐఎం, ప్రైవేట్ వర్సిటీల్లో ఫీజులు రూ.8 లక్షల నుంచి రూ.23 లక్షల వరకు ఉన్నయి.
అదే ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే 1 నుంచి 10వ తరగతి వరకు అయ్యే ఖర్చు ఏటా రూ.15 వేల నుంచి రూ.20 వేలు మాత్రమే.
పుట్టిన రోజునుంచే ఖర్చు
ఒకప్పుడు పిల్లల పెంపకానికి, చదువులకు అయ్యే ఖర్చును పెద్దగా లెక్కలోకి తీసుకొనేవారు కాదు. ఇప్పుడు పిల్లలు పుట్టినరోజు నుంచే ఖర్చు ప్రారంభమవుతున్నది. తల్లిదండ్రుల సంపాదనంతా పిల్లల పెంపకం, చదువులకే సరిపోతున్నది. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడ్డా పిల్లలకు అన్నింటినీ సమకూర్చలేని పరిస్థితి. ఆకాశాన్నంటిన ధరలే దీనికి కారణం. గత ఎనిమిదేండ్లలో సగటు కుటుంబ వ్యయం మూడు రెట్లు పెరిగింది. చదువుల ఖర్చులు రెండు, మూడు రెట్లు ఎక్కువయ్యాయి.
– కేతవరపు లత, విద్యార్థి తల్లి