హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కరెంట్ తీగల్లో పవర్ ఉందో లేదో తెలుసుకోవాలంటే వాటిని పట్టుకుంటే తెలిసిపోతుందని, బండి సంజయ్కు అనుమానం ఉంటే ఆ తీగలను పట్టుకోవాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్తో కలిసి మంత్రి పువ్వాడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ కాంగ్రెస్ను ఓడించడానికి వేరే పార్టీల నేతల అవసరం లేదని, ఆ పార్టీ నేతలే చాలని చెప్పారు. దేశ రాజకీయ చరిత్రలో ఖమ్మం బహిరంగ సభకు ప్రత్యేక స్థానం ఉం టుందని, అంతటి గొప్ప అవకాశాన్ని తమకు కల్పించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ బహిరంగసభతో దేశ రాజకీయాలే కాకుండా ఖమ్మం రాజకీయాలూ మారుతాయని చెప్పారు. సభ విజయానికి తమకు మార్గదర్శనం చేసిన మంత్రి హరీశ్రావుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభ నిర్వహణకు కేవలం పది రోజుల ముందే తేదీ ఖరారైనప్పటికీ సభ విజయవంతమైనదని, ఇందుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, సభకు తరలివచ్చిన నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సభ విజయవంతమైనదని, క్రమశిక్షణగల కార్యకర్తలు, నాయకులు పోటీపడి పనిచేశారన్నారు. ఖమ్మం జిల్లాలోని నేతలెవరినీ తాము బొట్టుపెట్టి పిలవాల్సిన పనిలేదని చెప్పారు.
దేశ రాజకీయాలను మార్చే సభ
2001లో కరీంనగర్లో జరిగిన సింహగర్జన సభ తెలంగాణ రాష్ట్ర సాధనకు నాంది పలికితే, ఖమ్మంలో లక్షలాది మంది తరలివచ్చిన బహిరంగ సభ దేశ రాజకీయాల్లో మార్పునకు పడిన తొలి అడుగని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. దేశంలో ప్రగతిశీల శక్తుల కలయికకు ఖమ్మం సభ బాటలు వేసిందన్నారు. దేశ సంపదను ఇద్దరు గుజరాతీలు అమ్ముతుంటే మరో ఇద్దరు గుజరాతీలు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. 2014లో సంపన్నుల జాబితాలో 604వ ర్యాంకు ఉన్న అదానీ, మోదీ అండదండలతోనే ప్రస్తుతం నంబర్ 1 స్థానానికి ఎగబాకారని ఆరోపించారు. ఇది నిజమా? కాదా? బీజేపీ నేతలు స్పష్టం చేయాలని నిలదీశారు. బండి సంజయ్కు తెలుగే సరిగ్గా రాదని, అటువంటి నాయకుడికి ముఖ్యమంత్రుల ఇంగ్లిష్, హిందీ ప్రసంగాలు ఏం అర్థం అవుతాయని ఎద్దేవా చేశారు. కరెంట్ గురించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బండి సంజయ్కు అవగాహన ఉంటదని తాము అనుకోవడం లేదని చెప్పారు.
ఖమ్మంలో పదికి పది బీఆర్ఎస్వే : రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో ఖమ్మం బహిరంగ సభ సూపర్డూపర్ హిట్ అయితే బండి సంజయ్ ఫ్లాప్ అయిందని పేర్కొనడంపై ఎంపీ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ఫ్లాప్ అయిందంటున్న బండి సంజయ్, కంటి వెలుగు పథకంలో పరీక్షలు చేయించుకోవాలని, రాలేకుంటే తామే ప్రత్యేక బృందా న్ని పంపిస్తామని తెలిపారు. ఖమ్మంలో బీజేపీకి స్థాన మే లేదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని తేల్చిచెప్పారు. ఖమ్మంలో పదికి పది స్థానాల్లో గెలిచేది బీఆర్స్సేనని ధీమా వ్యక్తం చేశారు.