హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి పథకంలో భాగంగా పాఠశాలల్లో కల్పించనున్న మౌలిక వసతులపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. స్కూళ్లకు అవసరమైన వస్తు సామగ్రిని ఒకేసారి పెద్దమొత్తంలో కొనుగోలుచేయటం ద్వారా తక్కువ ధరకే సేకరించేలా ప్రణాళిక రచిస్తున్నారు. నేరుగా తయారీదారుల నుంచే వస్తువులు సేకరిస్తే తక్కువ ధరకు లభించే అవకాశం ఉండటంతో ఇదే అంశాన్ని ప్రభుత్వానికి నివేదించాలని భావిస్తున్నారు. మనఊరు – మనబడి పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. మొదటి విడుత కార్యక్రమాన్ని ఏడాది నుంచే 9,123 స్కూళ్లలో చేపట్టనున్నారు. మొత్తం 12 అంశాలను తీసుకొని స్కూళ్ల రూపురేఖలను సమగ్రంగా మార్చనున్నారు. ఈ 12 అంశాల్లో కొన్ని వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉండటంతో వాటిని ఒకేసారి బల్క్గా సేకరించాలని భావిస్తున్నారు. ఈ విధానం వల్ల నాసిరకం వస్తువుల బెడదను కూడా అధిగమించవచ్చని పేర్కొంటున్నారు.
ఫర్నీచర్/ డ్యూయల్ డెస్క్ బల్లలు, ఆర్వో ప్లాంట్లు/ స్టీల్ ట్యాంకులు, ఫ్యాన్లు, రంగులు, గ్రీన్ చాక్పీస్ బోర్డులు, కంప్యూటర్లు, డైనింగ్ సామగ్రి వంటివాటిని రాష్ట్ర స్థాయిలో ఒకేసారి బల్క్గా కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ పథకంలో స్కూళ్ల ఎంపిక, చేపట్టే పనుల మంజూరు తదితర అంశాల్లో సంబంధిత జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులను భాగస్వాములను చేస్తారు. ఎంపిక, మంజూరులో జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు కట్టబెట్టగా, తాజా నిర్ణయం ప్రకారం జిల్లా మంత్రులు కూడా కీలకంగా వ్యవహరిస్తారు. జిల్లా మంత్రుల సూచనల మేరకే కలెక్టర్లు పనులు మంజూరుచేయనున్నారు. స్కూళ్ల అభివృద్ధి, మరమ్మతు పనులు టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలోనే కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. టెండర్లు పిలవడం, పనులు చేయడమంటే పెద్ద ప్రహసనమని, ఇందుకు పరిష్కారంగా నామినేషన్ పద్ధతిలోనే పనులు చేపట్టాలని అనుకొంటున్నారు. పనులు మంజూరుకాగానే నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు కేటాయిస్తారు. ఆయా కమిటీలే పనులకు పూర్తి బాధ్యత వహిస్తాయి. గ్రామ సర్పంచ్, పూర్వ విద్యార్థులతో కూడిన కమిటీలు పనులు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకొంటాయి.