హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు రహదారుల్లో నిత్యం ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్ల (ప్రమాదకర ప్రాంతాలు)ను గుర్తించిన రోడ్లు, భవనాలశాఖ వాటిని తొలగించేందుకు కృషి చేస్తున్నది. రాష్ట్రంలోని అన్ని రహదారులపై 463 బ్లాక్స్పాట్లను గుర్తించిన అధికారులు ఇప్పటికే 297 చోట్ల ప్రమాద కారకాలను తొలగించారు. మిగిలిన 166 చోట్ల తొలగించడానికి మరమ్మత్తులు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి కల్లా అన్ని బ్లాక్స్పాట్లను తొలగించే దిశగా చర్యలు చేపడుతున్నారు. రహదారులపై అడుగడుగునా నిఘా ఏర్పాటుచేశారు. వేగ నియంత్రణ పరికరాలను ఏర్పాటుచేసి నిర్దేశిత వేగం కంటే అధిక వేగంతో వెళ్లే వారికి భారీగా పెనాల్టీలు విధిస్తున్నారు. ఏ సమయంలో ఏ ప్రాంతంలో ఎంత వేగంతో వెళ్లాలో నిర్దేశిస్తూ సైన్బోర్డులు ఏర్పాటుచేశారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో నిదానంగా వెళ్లాలని సూచిస్తూ, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు.
ప్రమాదాల నివారణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2017లో రాష్ట్ర స్థాయిలో రోడ్డుసేఫ్టీ కౌన్సిల్ను ఏర్పాటుచేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు కలెక్టర్ చైర్మన్గా జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీలను నియమించారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి 5 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకొనేలా చర్యలు చేపట్టారు. ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇలా ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు సత్వర వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టారు.
ఏదైనా రహదారిపై మూడేండ్లలో ఒకేచోట 500 మీటర్ల పరిధిలో పది అతిపెద్ద ప్రమాదాలు జరిగిన ప్రాంతాన్ని బ్లాక్స్పాట్గా గుర్తిస్తారు. ఈ బ్లాక్స్పాట్ల స్థాయిని బట్టి అకడ ప్రమాదాల నివారణకు రోడ్లు, భవనాలు, రవాణా, వైద్య, విద్యాశాఖలు సంయుక్తంగా సమాలోచనలు చేసి చర్యలు చేపడుతున్నాయి. బ్లాక్స్పాట్లను గుర్తించిన తర్వాత రోడ్డు డిజైనింగ్లో ఏమైనా లోపాలున్నాయా? అన్న విషయాన్ని పరిశీలిస్తారు. ఒకవేళ అలాంటి సమస్యలు ఉంటే, వాటిని పరిషరిస్తారు.
బ్లాక్స్పాట్ సమీప ప్రాంతాల్లో వాహనదారులను హెచ్చరిస్తూ రవాణాశాఖ ప్రత్యేక బోర్డులు ఏర్పాటుచేస్తుంది. అవసరమైనచోట గ్రేడ్ సెపరేటర్స్ నిర్మాణం, రోడ్లు వెడల్పు లాంటి పనులు చేపడతారు. వైద్యశాఖ అధికారులు క్షతగాత్రులకు సత్వరం వైద్యసేవలు అందేలా చూస్తారు. రవాణాశాఖ అధికారులు వాహనాల ఫిట్నెస్, లెసెన్స్లపై దృష్టిసారిస్తారు. విద్యాశాఖ అధికారులు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ట్రాఫిక్పై అవగాహన కలిగిస్తారు. వాహనాల అతివేగాన్ని, మద్యం తాగి వాహనం నడిపే వారిని కట్టడి చేయడం కోసం పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలా వివిధ శాఖల సమన్వయంతో బ్లాక్స్పాట్లను తొలగించేందుకు రోడ్లు, భవనాలశాఖ అధికారులు కృషి చేస్తున్నారు.