హైదరాబాద్ : అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భవన యజమానులకు అవగాహన కల్పించే లా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మినిస్టర్ రోడ్ లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ భవన కూల్చివేత పనులను ఆదివారం పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా పరిసర ప్రాంత ప్రజలతో మాట్లాడారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకొని కూల్చివేత పనులు చేపట్టినట్లు వివరించారు. కూల్చివేత పూర్తయ్యే వరకు పరిసర ప్రాంత ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని వెల్లడించారు.
ప్రమాదం జరిగిన రోజు నుంచి ఈ ప్రాంత ప్రజలకు వేరొక ప్రాంతంలో వసతి కల్పించి ఆహారం కూడా అందిస్తున్నామని అన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురికి ప్రకటించిన రూ. రూ. 5 లక్షలను బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగిందని గుర్తు చేశారు.
నగరంలో అనుమతి లేని భవనాలు, జనావాసాల మధ్య ఉన్న గోదాముల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై చర్చించినట్లు మంత్రి తలసాని తెలిపారు.