కేంద్రానికి బిల్డర్లు, కార్మికుల డిమాండ్
రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏఫ్రిల్ 04 : దేశంలో రోజురోజుకూ మండిపోతున్న భవన నిర్మాణ సామగ్రి ధరలపై బిల్డర్లు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పనులను నిలిపివేసి నిరసన తెలిపారు. ఉత్పత్తిదారులు కుమ్మక్కై కృత్రిమంగా ధరలను పెంచుతున్నారని ధ్వజమెత్తారు. వీటిని వెంటనే నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రెడాయ్ తెలంగాణ, క్రెడాయ్ హైదరాబాద్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ తదితర నిర్మాణ సంఘాల పిలుపు మేరకు దాదాపు 1,200 మంది బిల్డర్లు, 30 వేల మంది ఆఫీస్ సిబ్బంది, 3 లక్షల మంది కార్మికులు ఈ బంద్లో పాల్గొన్నట్టు క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా తమ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని కోరారు. స్టీల్పై విధించే 7.5% దిగుమతి సుంకంతోపాటు నిర్మాణ సామాగ్రిపై జీఎస్టీని తొలగించాలని టీడీఏ అధ్యక్షుడు జీవీ రావు డిమాండ్ చేశారు.