మహబూబ్నగర్, ఆగస్టు 31 : పర్యాటకుల సౌకర్యార్థం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో మన్యంకొండ అలివేలు మంగ దేవాలయం సమీపంలో జాతీయ రహదారి చెంతనే బడ్జెట్ హోటల్ నిర్మిస్తున్నట్లు సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం హోటల్ నిర్మాణం కోసం రూ. 15 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు.
బుధవారం మన్యంకొండ స్టేజి సమీపంలో అలివేలు మంగ దేవాలయం సమీపంలో హోటల్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. హోటల్ నిర్మాణం పూర్తయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు, భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్..యాదాద్రి, వేములవాడ దేవాలయాలతో పాటు మన్యంకొండ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని వివరించారు.
సమైక్య రాష్ట్రంలో మన్యంకొండ దేవాలయ పుష్కరిణి ఎండిపోవడంతో స్వామివారి అభిషేకానికి కూడా కష్టంగా ఉండేదన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణా జలాలను కొండపైకి తీసుకుపోయి స్వామివారికి అభిషేకం చేయిస్తున్నట్లు తెలిపారు. కొండమీద భక్తుల కోసం నిర్మిస్తున్న 18 గదుల పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. అలివేలు మంగ దేవాలయం వద్ద ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నామని తెలిపారు.
ప్రతిపాదిత బడ్జెట్ హోటల్లో భక్తుల సౌకర్యార్థం గదులతోపాటు కాన్ఫరెన్స్ హాలు కూడా నిర్మిస్తున్నామని, ఇందులో శుభకార్యాలు నిర్వహించేందుకు అవకాశం ఉందన్నారు. మన్యంకొండ అభివృద్ధి కోసం ప్రసాద్ పథకం ద్వారా కూడా నిధులు తీసుకువచ్చేందుకు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామన్నారు.
మంత్రి వెంట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మన్యంకొండ దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త అలహరి మధుసూదన్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మల్లు నరసింహారెడ్డి, ముడా డైరక్టర్ దేవేందర్ రెడ్డి తదితరులున్నారు.