హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా ముదిగొండలో బౌద్ధస్తూపానికి తాపడం చేసిన శకలాలను గుర్తించారు. పాలరాతి శిల్పశకలాల ఫొటోలను ఖమ్మం జిల్లాకు చెందిన రచయిత, కవి, అధ్యాపకుడు ఆర్ సీతారాం కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి పంపించారు. వాటిని పరిశీలించిన చరిత్ర బృందం కన్వీనర్, కో-కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాస్ అవి బౌద్ధస్తూపానికి తాపడం చేసిన శకలాలేనని స్పష్టం చేశారు. ఆయన పంపిన రెండు ఫొటోల్లో ఒకటి ‘బుద్ధ పరినిర్వాణం’ చూపే పానెల్ కాగా, రెండోది సిద్ధార్థుని మహాభినిష్క్రమణం అనంతరం తాను ఎక్కి వెళ్లిన కంటకాశ్వం తిరిగివచ్చి శుద్ధోదనునికి విషణ్ణవదనంతో విన్నవిస్తున్న దృశ్యం అని ప్రముఖ చరిత్రకారుడు, స్థపతి శివనాగిరెడ్డి నిర్ధారించారు.
ముదిగొండలో ఇప్పటి వరకు చాళుక్యుల శాసనాలు, శిల్పాలు, దేవాలయాల నిర్మాణాల శిథిలాలే లభించాయని, ఇప్పుడు బౌద్ధస్తూపానికి సంబంధించిన శిల్ప ఫలకాలు సైతం దొరకడం విశేషమని పేర్కొన్నారు. అక్కడ అన్వేషణ జరిపితే కొత్త బౌద్ధస్తూపం బయటపడొచ్చని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు.