ఇక్కడ ఎక్కడ తవ్వినా బౌద్ధ నిక్షేపాలు
బుద్ధుడి బుద్ధుడి 2,585వ జయంతిలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఖైరతాబాద్, మే 16 : ‘తెలంగాణలో ఎక్కడ తవ్వి నా.. బౌద్ధ నిక్షేపాలు బయటపడుతున్నాయి, పిడికెడు మట్టి తీసినా ప్రపంచ చరిత్ర దాగి ఉంటుంది’ అని ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం గౌతమ బుద్ధుడి 2,585వ జయంతి సందర్భంగా హైదరాబాద్లో హుస్సేన్సాగర్లోని ఆయన విగ్రహం వద్ద బౌద్ధ భిక్షువులతో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నాగార్జునసాగర్ వద్ద బుద్ధవనాన్ని ప్రారంభించుకొన్నామని, ఇది ప్రపంచంలోనే అరుదైన ప్రాంతమని తెలిపారు.
ఒకప్పుడు బౌద్ధ మతానికి నిలయంగా ఉన్న తెలంగాణ ప్రాంతం బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిందని పేర్కొన్నారు. నేలకొండపల్లి స్థూపాలు, జోగులాంబ వద్ద తవ్వితే నాటి బౌద్ధ అవశేషాలు కనిపించాయన్నారు. గత పాలకులెవరూ ఈ చరిత్రను ప్రపంచ స్థాయికి తీసుకుపోలేదని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ వెలుగులోకి తెచ్చారని తెలిపారు. ప్రపంచానికి జ్ఞానబోధ చేసిన మహాత్ముడు గౌతమ బుద్ధుడు అని కొనియాడారు. భవిష్యత్తులో రాష్ర్టానికి మత గురువు దలైలామాతో పాటు థాయ్లాండ్, టిబెట్, శ్రీలంక, చైనా తదితర దేశాల నుంచి బౌద్ధ గురువులను రప్పించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచన సీఎం కేసీఆర్కు ఉందని మంత్రి వెల్లడించారు.