నల్లగొండ : దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అంకిత భావంతో పనిచేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. మొట్టమొదటిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికయిన రోజునే ఆయన దళితుల అభివృద్ధికి అంకురార్పణ చుట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితక్రాంతి పథకానికి కృతజ్ఞతగా శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియాలో సీఎం కేసీఆర్కు ధన్యవాదసభ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షత వహించిన ఈ సభకు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య, జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్ , సీనియర్ టీఆర్ఎస్ నేతలు యం.సి.కోటిరెడ్డి, యడవల్లి విజయేందర్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, ఎంపీటీలతో పాటు సర్పంచ్ లు పాల్గొన్నారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ దళితుల సాధక బాధకాలు సీఎం కేసీఆర్కు తెలుసన్నారు. దళితుల్లోని అన్ని వర్గాలకు సరిసమానంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు కేసీఆర్ తపన పడుతున్నారన్నారు. అందరికి అందుబాటులోకి దళిత క్రాంతి పథకాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. దశల వారిగా ఈ పథకాన్ని విస్తరిస్తామన్నారు. బడ్జెట్ ఎంతైనా కేటాయించేందుకు సీఎం కేసీఆర్ సిద్దంగా ఉన్నారన్నారు. మొదటిదశలో రూ. 1200 కోట్లతో నియోజకవర్గానికి 100 మంది చొప్పున రూ. 10 లక్షలు అందించనున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో రాలేదని ఏ ఒక్కరూ నిరాశ పడొద్దని అందరికి అందించేందుకు సీఎం సిద్దంగా ఉన్నారన్నారు.
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మీదటనే కార్పొరేట్ విద్యకు సరిసమానంగా ఎస్సీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కకాశాలలు ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అంతే గాకుండా విదేశీ విద్యకు వెళ్లే విద్యార్దులకు రూ. 20 లక్షలు ఉపకార వేతనంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఇపుడు దేశంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలలో ర్యాంకులు సాధిస్తున్న వారిలో మెజారిటీ విద్యార్థులు ఎస్సీ గురుకులాల నుండి వచ్చిన వారే కావడం అభినందనీయమన్నారు.