Telangana | సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వర్సిటీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న రేణుశ్రీ అనే విద్యార్థిని.. శుక్రవారం మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే కాలేజీ ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
మాదాపూర్కి చెందిన రేణుశ్రీ మూడు నెలల క్రితమే డే స్కాలర్గా గీతం వర్సిటీలో చేరింది. డేస్కాలర్గా చేరిన మూడు నెలలకే రేణుశ్రీ బలవన్మరణానికి పాల్పడటం ఇప్పుడు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. చదువు ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందా? ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కాకుండా కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకే ముందు రేణుశ్రీ ఓ ఫోన్కాల్ మాట్లాడిందని పోలీసులు గుర్తించిందని సమాచారం. ఆ కాల్ తల్లిదండ్రులకు చేసిందా లేక మరెవరికైనా చేసిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.