హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి, హైకమాండ్ అనుమతితోనే బీఆర్ఎస్తో పొత్తుకోసం చర్చలు జరిపినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మాయావతి చేసిన పోస్టు సారాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది తప్పుగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. జాతీయపార్టీతో కానీ, ఎన్డీయే, ఇండియా కూటమితో కానీ పొత్తు పెట్టుకోబోమని మాయావతి గతంలో చాలాసార్లు స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు.
తృతీయ ఫ్రంట్ కథనాలను కొట్టిపడేశారు. ఉత్తరప్రదేశ్లోనూ ఒంటరిగానే పోటీచేస్తామని అధినేత్రి చెప్పారని, కూటములతో, పార్టీలతో కలిసి పనిచేయడం గురించి ప్రస్తావించలేదని, ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. గతంలో మధ్యప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లోనూ జాతీయ పార్టీ ఉన్న కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతోనే పొత్తుపెట్టుకున్నామని, తెలంగాణలోనూ అదే జరిగిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కోసం ఇటీవల జరిగిన చర్చలకు పార్టీ హైకమాండ్ అనుమతి ఉన్నదని, సీట్ల పంపకంపై స్పష్టత వచ్చే వరకు చర్చలు కొనసాగుతాయని ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు.