RS Praveen Kumar | ఎమ్మెల్సీ కవిత అరెస్టును బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఖండించారు. ఈడీని అడ్డం పెట్టుకుని మోదీ ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్టు ఒక బూటకమని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు కేసీఆర్ తలొగ్గలేదని.. తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారితో పొత్తులకు సమ్మతించకుండా బీఎస్పీతో పొత్తులకు చేతులు కలిపిన కొద్ది గంటల్లోనే మోదీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్కు తెరతీశారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికమని అన్నారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బకొట్టడమే అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలాంటి అక్రమ అరెస్టులకు అదిరేది బెదిరేది లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు బెదిరితే తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. ఈ దుశ్చర్య బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారీ ఒప్పందంలో భాగమే అని స్పష్టం చేశారు. బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు చేయించిన ఈ అక్రమ అరెస్టును తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించిన ప్రజలు.. ఈ రెండు దోపిడీ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతున్నారని అన్నారు.
దేశంలో మోదీ పాలన.. నాటి నాజీల నియంతృత్వం కన్నా ఘోరంగా ఉందని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మొన్న మనీశ్ సిసోడియా, నిన్న హేమంత్ సోరెన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో.. నేనో అని వ్యాఖ్యానించారు. అందుకే తెలంగాణ సమాజంతో పాటు యావత్ దేశం బీజేపీ-కాంగ్రెస్లను తక్షణమే తిరస్కరించాలని అవసరం ఉందన్నారు.