మెదక్ : జిల్లాలోని శేట్పల్లి గ్రామంలో మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు ఆమె గొంతుకోసి మెడలో ఉన్న బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటేశం, సుజాత దంపతులు పట్టణంలోని మార్కెట్లో కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
శనివారం ఉదయం 10 గంటలకు భార్య సుజాత వంట వండి భోజనం తీసుకురావడానికి ఇంటికి వెళ్లింది. మధ్యాహ్నం వరకు ఆమె తిరిగి రాకపోవడంతో భర్త వెంకటేశం సెల్ఫోన్ చేసినా స్పందన రాలేదు. దీంతో అతడు ఇంటికి వెళ్లి చూడగా భార్య సుజాత (40) దారుణ హత్యకు గురైన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మెదక్ డీఎస్పీ సైదులు, పట్టణ సీఐ మధు, మెదక్ రూరల్ సీఐ విజయ్ కుమార్ తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీం , డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరించారు.
జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఘటనా స్థలాన్ని సందర్శించి హత్య జరిగిన తీరును పరీక్షించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని ఆమె తెలిపారు.