హైదరాబాద్ సిటీబ్యూరో/చిక్కడపల్లి, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబుయాదవ్, ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 40 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ఆటో డ్రైవర్ల కుటుంబాల ఉసురు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా తగులుతుందని అన్నారు. చిక్కడపల్లిలోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా మలక్పేటలో రమేశ్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఒక్క తాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ బుద్ధిచెప్తామని హెచ్చరించారు. బీఆర్టీయూ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి మన హక్కులు మనం సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్కు నెలకు రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు గిరాకీ లేక ఉపాధి కోల్పోతున్నారని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం హైదర్గూడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత బస్సు పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.