హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్లకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (బీఆర్టీయూ అనుబం ధం) రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి కోరారు. శుక్రవారం హైదరాబాద్లో మంత్రి సత్యవతి రాథోడ్ను భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి వినతిప్రతం అందజేసింది. అనారోగ్యంతో బాధపడుతూ నాన్లోకల్గా ఉన్న టీచర్లను బదిలీ చేయాలని, టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న చోట సహాయకులకు పదోన్నతులు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
గర్భిణీ, బాలింతల కోసం టీహెచ్ఆర్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరింది. ప్రతి నెల 5లోపు వేతనాలు చెల్లించాలని, పెండింగ్స్ వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. మంత్రిని కలిసినవారిలో యూనియన్ ఉపాధ్యక్షురాలు బీ రమాదేవి, కోశాధికారి ఎం వేదవతి, నాయకులు బీ శిరీష, పీ సురేఖ తదితరులు ఉన్నారు.