హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ను ఎన్నుకొనేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్యలను అడ్డుకొన్నందుకే అక్కడి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అక్రమంగా అరెస్టు చేసి, నిర్బంధించారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
క్యాతనపల్లిలో బీఆర్ఎస్, సీపీఐ కూటమికి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్ అధికార, పోలీసు, ధన బలంతో ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నదని ఆరోపించారు. చట్టాలను తుంగలో తొక్కుతూ, అరాచక రాజకీయాలకు తెరలేపడం అత్యంత దారుణమైన చర్య పేర్కొన్నారు. రాష్ట్రమంతటా కాంగ్రెస్ మార్కు గూండాగిరి కొనసాగుతున్నదని, మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ దౌర్జన్య రాజకీయాలు బహిర్గతమవుతున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు నిస్సిగ్గుగా కాంగ్రెస్ గూండాలకు కొమ్ముకాయడం ద్వారా, కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎంత దారుణంగా పతనమవుతున్నాయో స్పష్టమవుతున్నదని మండిపడ్డారు.