హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాఫూలే ఆశయాలను పదేండ్ల పాలనలో కేసీఆర్ ఆచరణలో పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి కృషిచేయడంతోపాటు అన్నివర్గాల విద్యార్థులకు సమున్నతమైన విద్యావకాశాలు కల్పించి ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దారని వివరించారు. తెలంగాణభవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జ్యోతిబాఫూలే 197వ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. కేటీఆర్తోపాటు పలువురు సీనియర్ నేతలు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాలం, సమయంతో పనిలేకుండా నిరంతరం ప్రజాసేవలోనే గడిపిన సంఘసంస్కర్తల్లో ఫూలే మొదటివరసలో ఉంటారని కొనియాడారు.
కుల వివక్షను, ఇతర అసమాతనలను పారదోలేందుకు చదువొక్కటే మార్గమని నమ్మి, ఆ దిశగా సమాజాన్ని చైతన్యం చేశారని వివరించారు. ఫూలే ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ చదువుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటుచేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజన, వసతి ఏర్పాట్లు చేయించారని, ఒక్కొక్క విద్యార్థిపై ఏడాదికి రూ.1.20 లక్షలు ఖర్చు చేశారని వివరించారు. ఉన్నత విద్య కోసం డిగ్రీ కళాశాలలు స్థాపించారని, విదేశీ విద్య కోసం వెళ్లేవారికి రూ.20 లక్షల చొప్పున సుమారు పదివేల మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్ల పేరిట ఆర్థికసాయం చేశారని గుర్తుచేశారు. విద్య ద్వారా వచ్చే ప్రయోజనాలను సమాజంలోని అన్ని వర్గాలకు అందించారని పేర్కొన్నారు.
జ్యోతిబాఫూలే చూపిన బాటలో విద్య, ఉపాధి అవకాలు కల్పించడమే కాకుండా పదేండ్ల పాలనలో బడుగు, బలహీనవర్గాల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని కేటీఆర్ తెలిపారు. అన్ని కులాల వృత్తులను ప్రోత్సహించి పల్లెసీమలకు ప్రాణం పోశారని చెప్పారు. దేశంలో ఎక్కడాలేనంతగా తెలంగాణలో జీవాల సంపద పెరడగానికి కేసీఆర్ కారణమని, రూ.11వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేపట్టారని వివరించారు. నేతన్నలను చేనేతమిత్ర, నేతన్నకు చేయూత వంటి పథకాల ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకున్నదని పేర్కొన్నారు. గౌడన్నలకు చెట్ల పన్నులు మాఫీ, నీరాపాలసీ, ప్రమాదబీమా వంటివి కేసీఆర్ అమలుచేశారని గుర్తుచేశారు.
ఎంబీసీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేశారని అన్నారు. ‘అధికారంలో ఉన్నప్పుడు అన్నార్థులను ఆదుకోవాలి’ అనే దృఢ సంకల్పంతో ఇతర బలహీనవర్గాలకు బీసీబంధు, మైనార్టీబంధు, దళితబంధు వంటివి తీసుకొచ్చి.. వారి అభ్యన్నతికి విశేష కృషిచేశారని కొనియాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చామని, ఎంపీ ఎన్నికల్లో కూడా బీసీలకు 50% సీట్లు కేటాయించామని తెలిపారు. ఇలా ఎన్నో చర్యలు, పథకాల ద్వారా ఫూలే ఆశయాలకు కేసీఆర్ తన ఆచరణ ద్వారా ఘన నివాళి అర్పించారని తెలిపారు.
బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప సంఘ సంసర్త, మానవతవాది జ్యోతిబాపూలే అని మాజీ స్పీకర్ మధుసూదనాచారి కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినా బీసీలకు చేస్తున్నది ఏమీ లేదని విమర్శించారు. బీసీలను రాజకీయాల కోసమే వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై బడుగు, బలహీన వర్గాలు కన్నెర్ర చేయడం ఖాయమని హెచ్చరించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. పదేండ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిందని చెప్పారు. సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఫూలే స్ఫూర్తితో ప్రతిజ్ఞ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీలు శ్రీనివాస్రెడ్డి, కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్యాదవ్, వెంకటేశ్వర్రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, మన్నే గోవర్ధన్, విప్లవ్కుమార్, నియాజ్ పాల్గొన్నారు.
అపారమైన అనుభవం, నిబద్ధత కలిగిన నేత కొప్పుల ఈశ్వర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. విజయవంతమైన నాయకులుగా ఎదగాలని కాంక్షించే యువతకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘80వ దశకం చివర్లో సాధారణ సింగరేణి కార్మికుడిగా తన వృత్తిని ప్రారంభించిన ఈశ్వర్.. కార్మికుల హక్కుల కోసం పోరాడారు. 90వ దశకం చివర్లో 2001లో టీఆర్ఎస్లో చేరారు. 2004 లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై, 20 ఏండ్ల లో కేసీఆర్ ప్రభుత్వంలో చీఫ్విప్గా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ తరఫున పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. పెద్దపల్లి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అవకాశం ఆయనకు కల్పిస్తారని ఆశిస్తున్నాను’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ‘బీసీ డిక్లరేషన్’ను సాధ్యమైనంత త్వరగా అమలుచేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డిక్లరేషన్లలో ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. జ్యోతిబాఫూలే పేరిట బీసీ సబ్ప్లాన్ తీసుకొస్తామని, బడ్జెట్లో ఏటా రూ.20 వేల కోట్లు, ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పారని, కానీ, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వాటి ప్రస్తావనే రాలేదని దుయ్యబట్టారు. వచ్చే శాసనసభా సమావేశాల్లో బీసీ సబ్ప్లాన్ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీ మేరకు ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలని, ప్రతి మండల కేంద్రంలో ఆధునిక గురుకులాలు ఏర్పాటు చేస్తామన్న మాటను నిలుపుకోవాలని సూచించారు. అంబేద్కర్ విగ్రహం మాదిరిగానే జ్యోతిబా ఫూలే 200వ జయంతి నాటికి ఆయనకు సమున్నత విగ్రహం భారీస్థాయిలో ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.