KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కారు చేతకానితనంతో నిన్న జూరాల ప్రాజెక్టును డేంజర్లోకి నెట్టిన సంఘటనకు 24 గంటలు గడవకముందే హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలో పడేయడం అత్యంత ఆందోళనకరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణలో సీఎం రేవంత్ ఘోర వైఫల్యం వల్లే వరుసగా నిన్న జూరాల ప్రాజెక్టుకు, నేడు మంజీరా బ్యారేజీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ) నిపుణుల బృందం గత మార్చి 22న బ్యారేజీని సందర్శించి సమర్పించిన నివేదికను ప్రభుత్వం నిర్లక్ష్యంగా పక్కనపెట్టడం క్షమించరాని నేరం. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కూడా చరిత్రలో లేనంత వరద రావడంతో రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చిన తరహాలోనే, ఇప్పుడు మంజీరాపై కూడా వరద ఒత్తిడి పెరిగి దిగువ భాగంలో పిల్లర్లకు పగుళ్లు రావడం, ఆఫ్రాన్ కొట్టుకుపోవడం, స్పెల్ వేలోని భాగాలు కూడా దెబ్బతిన్నట్టు ఎస్డీఎస్ఏ నివేదిక గుర్తించినా ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడకపోవడం మరో దుర్మార్గం అని కేటీఆర్ మండిపడ్డారు.
నిన్నటిదాకా ఎన్డీఎస్ఎ నివేదిక చెప్పినా మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయకపోవడం, నేడు ఎస్డీఎస్ఓ నివేదిక అందినప్పటికీ మంజీరా బ్యారేజీ మరమ్మత్తులు చేపట్టకపోవడం.. ఈ కాంగ్రెస్ సర్కారు అలసత్వానికే కాదు.. దుర్మార్గపు వైఖరికి ప్రత్యక్ష నిదర్శనం అని నిప్పులు చెరిగారు కేటీఆర్. రానున్న రోజుల్లో పైనుంచి మంజీరాలో వరద ఉధృతి పెరిగితే మరింత కోతకు గురై చివరికి డ్యామ్ను కూడా ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి తలెత్తవచ్చని నిపుణులు అంచనా వేస్తున్న క్రమంలో ఇకనైనా ఈ చిల్లర రాజకీయాలు మాని అటు మేడిగడ్డ బ్యారేజీని, ఇటు మంజీరా బ్యారేజీని వెంటనే రిపేర్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ సర్కారుపై ఉందని కేటీఆర్ అన్నారు.
బ్యారేజీల సామర్థ్యానికి మించిన వరద వచ్చిన సందర్బాల్లో ఆ ఒత్తిడిని తట్టుకోలేకే పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్టు ఎస్డీఎస్ఓ గుర్తించింది. సరిగ్గా మేడిగడ్డ వద్ద కూడా ఊహించని వరద పోటెత్తడం వల్ల అక్కడ కూడా ఇదే తరహాలో పగుళ్లు ఏర్పడ్డాయి. కానీ దీన్ని అసెంబ్లీ ఎన్నికల వేళ భూతద్దంలో చూపించి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్పై బురదజల్లాయి. మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పియర్స్కు వచ్చిన పగుళ్లపై నానాయాగీ చేసిన కాంగ్రెస్-బీజేపీ నేతలు మంజీరా బ్యారేజీ పిల్లర్లకు వచ్చిన పగుళ్లపై కనీసం స్పందించకపోవడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు, బ్యారేజీల్లో స్వల్ప రిపేర్లు వస్తే, అప్పటికప్పుడు వాటిని మరమ్మత్తు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారే తప్ప కాళేశ్వరంపై కక్షగట్టినట్టు ఏ ప్రభుత్వాలు గతంలో వ్యవహరించలేదు. పరిపాలన చేతకాక కేవలం రాజకీయ కక్షసాధింపులతో కాలం వెల్లదీస్తున్న ఈ ముఖ్యమంత్రి మంజీరా, మేడిగడ్డ వంటి తాగు సాగునీటి బ్యారేజీలను రిపేర్లు చేయకుండా వదిలేస్తే, సీఎం రేవంత్ను, కాంగ్రెస్ సర్కారును చరిత్ర ఎప్పటికీ క్షమించదు అని కేటీఆర్ హెచ్చరించారు. చివరకు జై తెలంగాణ అని కేటీఆర్ నినదించారు.