అందోల్, ఆగస్టు 8 : సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వహించిన ఘటనలో సంబంధిత దంత వైద్యుడిపై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేయడంతో డాక్టర్ రమేశ్ను శుక్రవారం సస్పెండ్ చేశారు.
ఆయన స్థానంలో విధులు చేపట్టిన దంత వైద్యుడు రవిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించగా, శనివారం జోగిపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దంత వైద్యుడు రవి సస్పెండైన డాక్టర్ రమేశ్తో పాటు మరో ఇద్దరు వైద్యుల స్థానంలో సైతం విధులు నిర్వహించారని, ఆ దిశగా సైతం దర్యాప్తు జరిపి కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.