KTR | మేడ్చల్ : జై శ్రీరాం నినాదం కడుపు నింపదు.. ఆ నినాదం నీకు ఉద్యోగం ఇవ్వదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి అని కేటీఆర్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ రాష్ట్రంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందా.. అంటే అది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మాత్రమే. మనిషిని మనిషిగా చూసే పార్టీ.. మతం కోణంలో చూడని పార్టీ కూడా బీఆర్ఎస్సే. యువత ఎవరైనా జై శ్రీరాం అంటే సముదాయించాలి. జై శ్రీరాం అనే నినాదాం కడుపు నింపదు.. నీకు ఉద్యోగం ఇవ్వదు.. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి.. కొట్టాడేటోళ్లు కావాలి.. మీ కోసం పార్లమెంట్లో కొట్లాడేవాళ్లు కావాలని యువతకు విడమరిచి చెప్పాలని కేటీఆర్ సూచించారు.
ఈ దేశాన్ని ప్రధాన మంత్రిగా మోదీ పదేండ్లు పాలించారు. అదే పదేండ్లలో కేసీఆర్ సీఎంగా ఉన్నారు. కేసీఆర్ ఏం చేశారంటే ఎన్నో కార్యక్రమాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రతి కుటుంబం ఏదో ఒక సంక్షేమ పథకంతో లాభపడ్డది. కానీ మోదీ ఏం చేశారంటే చెప్పలేరు. అదే మాటను ఈటల రాజేందర్ను అడుగుతున్నా.. నీకు దమ్ముంటే, బీజేపీకి సత్తా ఉంటే.. మోదీ ప్రభుత్వం మా మల్కాజ్గిరి పార్లమెంట్కు ఏం చేసిందో చెప్పి ఓటు అడగాలని ఈటల రాజేందర్ను డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు.. కానీ మనకు గుండు సున్నా. మనకు ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క విద్యాసంస్థ ఇవ్వకుండా ప్రధాని కాలయాపన చేశారు. ఏం చేశారంటే జై శ్రీరామ్ అంటరు తప్ప.. చెప్పుకునేందుకు ఏం లేదు. మేం కూడా జై శ్రీరామ్ అంటున్నం. కానీ మేం రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం. యాదాద్రి కేసీఆర్ అద్భుతంగా నిర్మించారు.. దాన్ని రాజకీయంగా వాడుకోలేదు. నిజమైన హిందువు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడు అని కేటీఆర్ పేర్కొన్నారు.
రైతు రుణమాఫీ గురించి మాట్లాడేందుకు ఈటల రాజేందర్కు సిగ్గు అనిపించాలి. కేసీఆర్ ప్రభుత్వంలో ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మొదటి టర్మ్లో రూ. 16 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశాం. రెండో టర్మ్లో కరోనా ఉన్న రూ. 19 వేల కోట్లకు గానూ రూ. 14 వేల కోట్ల రుణమాఫీ చేశారు కేసీఆర్. మోదీ ప్రభుత్వం 10 ఏండ్లలో రూ. 14 లక్షల కోట్ల రుణమాఫీ చేసిండు.. ఇది కూడా పెద్ద వ్యాపారులకు చేసిండు. చిన్నవారికి సాయం చేయలేదు. రైతులకు మోదీ ఏం చేయలేదు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు బీజేపోళ్లు. రాష్ట్రానికి పనికి వచ్చే పనులు చేయరు. కానీ మతం పేరుమీద పిల్లల మెదడు ఖరాబ్ చేస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే బీజేపీకి లాభం అవుతుంది. రేవంత్ రెడ్డి ఎవరి కోసం పని చేస్తున్నాడో అర్థం కావడం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఫస్ట్ జంప్ అయ్యేది రేవంత్ రెడ్డినే. ఎందుకంటే ఆయన లెక్క ఆయనకు ఉన్నది. ఆయన రాజకీయ జీవితం చూస్తే మొదట బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్లో చేరారు. రేపు మాతృస్ంస్థ బీజేపీలోకి మళ్లీ పోతాడు. ఈ విషయాన్ని పదిహేను సార్లు అన్నాను.. ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి ఖండించలేదు అని కేటీఆర్ తెలిపారు.