KTR | కరీంనగర్ : పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లు గెలిస్తే.. కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అనుకునేటోళ్లు కారు గుర్తుకు ఓటేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తంగళ్లపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు, కౌలు రౌతులకు పైసలిస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. మహిళలకు రూ. 2500, ఇంట్లో పెద్ద మనుషులు ఇద్దరికీ రూ. 4 వేలు అన్నాడు. తులం బంగారం, స్కూటీలని రేవంత్ రెడ్డి చెప్పిండు. రంగుల కలలాంటి సినిమా చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఐదు నెలల్లోనే ప్రజలందరికీ అన్ని విషయాలు అర్థమయ్యాయి. అన్ని వర్గాలు కోపంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన అబద్దాలనే ఇంకా చెబుతున్నారు. ఆరు గ్యారంటీల్లో ఐదు పూర్తి చేసినట్లు ఇప్పటికీ రేవంత్ రెడ్డి బొంకుతున్నాడు. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు రుణమాఫీ విషయంలో తేదీలు మార్చుతుండు. దేవుడి మీద ఒట్లు…కేసీఆర్ మీద తిట్లు.. ఈ 4 నెలల్లో రేవంత్ రెడ్డి చేసింది ఇదే అని కేటీఆర్ పేర్కొన్నారు.
తంగళ్లపల్లి ప్రజలకు నా మీద కోపం వచ్చినట్లు ఉంది. మొన్నటి ఎన్నికల్లో కొంచెం మెజార్టీ తగ్గించారు. నేను తెలిసో తెలియకనో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. కరెంట్ కోతలు, నీళ్ల కష్టాలు, బోనస్ సంగతి పక్కన పెట్టిండు, తంగళపళ్లి బ్రిడ్జి కింద నీళ్లు లేకుండా చేశారు. బీజేపోళ్లు డైరెక్ట్గా 400 సీట్లు వస్తే మొత్తం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలంటే కచ్చితంగా పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండాలె. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. ఆయనను తంగళ్లపల్లి చౌరస్తాలో నిలబెడితే కాంగ్రెసోళ్లే గుర్తుపట్టరు అని కేటీఆర్ పేర్కొన్నారు.
మన అవసరాలను కాదని గోదావరి నీళ్లను కర్ణాటక, తమిళనాడు మళ్లిస్తాడంట మోడీ. ఇలాంటి కుట్రలను ఎదుర్కొవటం బీజేపీ, కాంగ్రెస్ వాళ్ల తోని అయ్యే పని కాదు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ను యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది. ఇక పార్లమెంట్ స్థానాలకు ఒక్కటే జిల్లా ఉండాలని రేవంత్ రెడ్డి చెబుతుండు. జిల్లాలు రద్దు కాకుండా ఉండాలంటే దానికోసం కొట్లాడాలంటే బీఆర్ఎస్ లోక్ సభలో ఉండాలె. మనకు మనకు ఎన్ని గొడవలున్నా సరే వాటిని పక్కన పెట్టండి. సిరిసిల్లలో పదేళ్లు ఆత్మహత్యలు అనే మాట వినబడలే. మళ్లీ ఇప్పుడు నేతన్నల ఆత్మహత్యలు మొదలైనయ్. కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది. కరెంట్ లేదు. ఆత్మహత్యలు మొదలైనయ్. మళ్లీ బీఆర్ఎస్ గెలవాలె. తెలంగాణ పచ్చగా కళకళలాడాలె. ఉన్న నాలుగు రోజులు కష్టపడి ప్రచారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు.