KTR : కరీంనగర్ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ గారికి కరీంనగర్ జిల్లా అంటే సెంటిమెంటని, కరీంనగర్ నుంచి ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అయితది అనే విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నదని, కాబట్టే పార్టీ పెట్టిన తర్వాత మొదటి బహిరంగ సభ సింహగర్జణ 2001 మే 17న ఎస్ఆర్ఆర్ కాలేజీలో పెట్టారని కేటీఆర్ చెప్పారు.
నాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ కరీంనగర్ గడ్డ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ నుంచి ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అయితదని, అందుకే పార్టీ కార్యకర్తల తొలి సమావేశాన్ని కూడా కరీంనగర్లోనే పెట్టామని చెప్పారు. నాడు ‘తెలంగాణ ఉద్యమం ఏడున్నది..? వైఎస్ సంక్షేమ పథకాల గాలిలో కొట్టుకుపోయింది’ అని అప్పటి పీసీసీ అధ్యక్షుడు పిచ్చి ప్రేలాపనలు చేస్తే.. కేసీఆర్ ఉద్యమ ఊపు చూపించడానికి కరీంనగర్లో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ బరిలో దిగారని గుర్తుచేశారు. అప్పుడు కేసీఆర్ను ఏకంగా 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించి కరీంనగర్ దమ్మేందో చూపెట్టిన గడ్డ కరీంనగర్ గడ్డ అని కొనియాడారు. పోరాటాల పురిటిగడ్డ ఈ కరీంనగర్ గడ్డ అని ప్రశంసలు కురిపించారు.
బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రత్యేకమైన పార్టీ అని, ఈ దేశంలో ఎన్నో పార్టీలు పుట్టినయ్.. మాయమైపోయినయ్.. అని, ఉద్యమ పార్టీగా పుట్టి పదేళ్లు అధికార పార్టీగా వెలుగొందిన పార్టీ అని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల తలరాతలు మార్చిందని అన్నారు. గత 16 నెలల నుంచి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తూ ప్రతిపక్ష పార్టీ అంటే ఎట్లుండాల్నో చాటిచెబుతోందని చెప్పారు. మన పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఒకే ఒక్క లక్ష్యంతోనని, 25 ఏళ్ల క్రితం 2001 ఏప్రిల్ 27న పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో జయశంకర్ గారి లాంటి ఎంతో మంది మహానుభావుల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ పురుడుపోసుకున్నదని గుర్తుచేశారు.