KTR | కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాలంగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. దినదిన గండంగా తెలంగాణ మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అల్లుని కంపెనీల కోసం అదానీ పరిశ్రమల కోసం.. అన్నదమ్ముల ఆస్తుల పెంపు కోసం.. ఢిల్లీకి మూటల చేరవేత కోసం పేదల భూములు లాక్కుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రలను ఎదుర్కొని లాఠీల దెబ్బలు తిని, చేతులకు బేడీలు వేసుకొని, నెలలపాటు చెరసాలల పాలైనా భూములను చెరబట్టడంలో మాత్రం రేవంత్ ప్రభుత్వం పట్టువదలడం లేదని అన్నారు.
పట్నంలో పేదల గూళ్లు, ఉపాధి కేంద్రాలు, పాలడబ్బాలు, చెప్పుల దుకాణాలు… పల్లెల్లో పేదల భూములు, గరీబోళ్ల ఇండ్లు, పంటపొలాలు, పచ్చని పైర్లలో రేవంత్ అధికారుల స్వైర విహారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాదేది అణచివేతకు అనర్హం కాదన్నట్టు తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాలంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. దినదిన గండంగా తెలంగాణం మారిందని వ్యాఖ్యానించారు. ఎట్లుండె తెలంగాణ ఎట్లాయే అని ఆవేదన వ్యక్తం చేశారు.