KTR | రంగారెడ్డి : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మైక్ వీరుడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మైక్ పట్టుకుంటే ఆయనకు పూనకం వచ్చి.. ఏది పడితే అది మాట్లాడుతాడు అని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భువనగిరి పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్, బీజేపోళ్లకు భయపడే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి మైక్ వీరుడు. మైకు పట్టుకుంటే ఆయనకు పూనకం వస్తుంది. ఏది పడితే అది మాట్లాడుతాడు. ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపెట్టారు కాంగ్రెసోళ్లు. రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అన్నాడు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమైంది..? రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం ప్రభుత్వానికి తెలివి అవగాహన లేకపోవడమే. ఇక్కడ ఫార్మా సిటీ పెట్టాలని రైతులకు మంచి పరిహారం ఇచ్చి భూసేకరణ చేశాం. అనుమతులు కూడా తెచ్చాం. ఆ కంపెనీలకు జాగ ఇచ్చి లక్షల మందికి కొలువులు తెచ్చే ఫార్మా సిటీని నడుపుకునే తెలివి లేని సన్నాసులు కాంగ్రెస్ నాయకులు. కంపెనీలు, ఫ్యాక్టరీలు, యూనివర్సిటీలు, కాలేజీలు వస్తే రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది. ఫాక్స్కాన్ తెప్పించాం.. మే నెలలో ప్రారంభం కావాల్సిన ప్రాజెక్టు. కానీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు అని కేటీఆర్ తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలకు రేవంత్ రెడ్డి మంగళం పాడుతారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వంద రోజుల్లో ఫ్రీ బస్సు ఒక్కటే స్టార్ట్ చేసిండు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫ్రీ బస్సుకు మంగళం పాడుతాడు. ఈ పథకం వల్ల ఆర్టీసీకి రూ. 1400 కోట్ల నష్టం వచ్చింది. తులం బంగారం అనగానే మహిళలు సెంటిమెంట్కు పడిపోయి ఓట్లు వేశారు. కానీ తులం బంగారం ఇవ్వడం లేదు. ఈ విషయాలను వివరంగా చెప్పాలి అని కేటీఆర్ సూచించారు.