KTR | హైదరాబాద్ : తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డినే.. ఆ దయ్యాన్ని ఎలా వదిలించాలనేది మా ప్రయత్నం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్.. దయ్యం రేవంత్ రెడ్డి.. ఈ దయ్యాన్ని, శనిని ఎలా వదిలించాలనేది మా టార్గెట్. లోక్సభ ఎన్నికలకు ముందు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు పెట్టాం.. అసెంబ్లీలో ఓడిపోయాం.. ఎలా ముందుకు పోవాలని 17 రోజుల పాటు వేల మంది కార్యకర్తలతో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలా మంది డైరెక్ట్గా మైక్లో మాట్లాడిన వారు ఉన్నారు. కొంత మంది చిట్టీల మీద రాసిచ్చిన వారు ఉన్నారు. కొంత మంది కేసీఆర్కు ఉత్తరం అందించండి అని ఉత్తరాలు ఇచ్చిన వారు ఉన్నారు. మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది. మా పార్టీ అధ్యక్షుడికి ఏవైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి.. సూచనలు సలహాలు చేస్తూ అధ్యక్షుడికి లిఖిత పూర్వకంగా, ఓరల్గా ఇవ్వొచ్చు అని కేటీఆర్ పేర్కొన్నారు.
పార్టీలో ఏ హోదాలో ఉన్నా.. అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటది. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంది.. ఆఫీస్ బేరర్స్ ఉన్నారు.. వారిని కూడా కలిసే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాలు అంతర్గతంగానే మాట్లాడితే బాగుంటుంది.. ఇది అందరికీ వర్తిస్తుంది. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు.. అందులో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉంటే ఉండొచ్చు అని కేటీఆర్ అన్నారు.