హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా సాగిన పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్టు పేర్కొంది. ఈ నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనకు ఇదో గీటురాయి అని వ్యాఖ్యానించారు. 2005-06 నుంచి ఇప్పటివరకు దేశంలో ‘బహుముఖ పేదరికం’పై (మల్టి డైమెన్షనల్ పావర్టీ) నీతి ఆయోగ్ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం దేశంలో 11.28 శాతం మంది ఇంకా పేదరికంలో ఉన్నా రు. దేశవ్యాప్తంగా 2013-14లో 29.17 శాతం మంది జనాభా పేదరికంలో ఉండగా.. 2022-23 నాటికి వారు 11.28 శాతానికి తగ్గారు. గత తొమ్మిదేండ్లలో 61 శాతం మేర పేదరికం తగ్గినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. మొత్తం 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డట్టు తెలిపింది. దేశంలో అతితక్కువ పేదరికం ఉన్న రాష్ర్టాల జాబితాలో టాప్-3 రాష్ర్టాలు దక్షిణ భారతదేశంలోనే ఉండటం విశేషం.
కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం 2013-14లో తెలంగాణ ప్రాంతంలో పేదరికం 21.92 శాతంగా ఉండేది. ఇది అప్పటి జాతీయ సగటు కన్నా ఎక్కువ. ప్రతి వంద మందిలో 22 మంది పేదరికంలో మగ్గారు. నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో పేదరికం 2022-23 నాటికి 3.76 శాతానికి తగ్గింది. అంటే కేసీఆర్ పాలనలో తొమ్మిదేండ్లలోనే 82.85 శాతం పేదరికం పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా తొమ్మిదేండ్లలో ప్రతి వంద మంది పేదల్లో 83 మంది పేదరికం నుంచి బయటపడినట్టు తెలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి జాతీయ సగటు కన్నా అధికంగా పేదరికంలో ఉన్న తెలంగాణలో నేడు మూడోంతులు తక్కువగా నమోదైంది. తద్వారా దేశంలో అతి తక్కువ పేదలున్న పెద్ద రాష్ర్టాల్లో మూడో స్థానంలో నిలిచింది. కేరళ (0.48%), తమిళనాడు (1.43%) మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. టాప్-3 రాష్ర్టాలన్నీ దక్షిణాదికి చెందినవే కావడం గమనార్హం.
మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే రాష్ట్రంలో పేదరికం అనూహ్యంగా తగ్గిందని ఆర్థిక, రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్తు మొదలు అనేక సమస్యలు ఉండేవని, కేసీఆర్ పాలనలో ఒక్కొక్కటి పరిష్కారం అయ్యాయని గుర్తు చేస్తున్నారు. దీంతోపాటు ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన పథకాల ఫలితంగా ప్రజలు ఆర్థికంగా బలపడ్డారని చెప్తున్నారు. రాష్ట్ర జీఎస్డీపీ రూ.4.51 లక్షల కోట్ల నుంచి మూడున్నర రెట్లు పెరిగి రూ.13.27 లక్షల కోట్లకు చేరిందని గుర్తు చేస్తున్నారు. తలసరి ఆదాయం రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.1.12 లక్షలు ఉండగా, ఇప్పుడు దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.3.17 లక్షలకు పెరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో వసతుల కల్పన, పథకాలు, ప్రాజెక్టుల అమలు వంటివాటికోసం సుమారు రూ.13 లక్షల కోట్లు వ్యయం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల స్వేదపత్రంలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓవైపు పెట్టుబడులు, మరోవైపు పంట ఉత్పత్తులు, మరోవైపు సంక్షేమ పథకాల కారణంగా పేదరికం తగ్గిందని స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గిందని నీతి ఆయోగ్ నివేదిక చెప్పడం గర్వంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. ‘చాలా గర్వంగా ఉన్నది. గత దశాబ్దంలో తెలంగాణ ఎంత బాగా ఎదిగిందో నివేదిక రూపంలో తెలియజేసినందుకు నీతి ఆయోగ్కు ధన్యవాదాలు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.