KTR | హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ తీసుకొచ్చిన టీఎస్ స్థానంలో రేవంత్ టీజీ తీసుకొచ్చారు. తాజాగా అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో రూపొందించిన రాష్ట్ర అధికారిక చిహ్నంలోని కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తున్నట్లు రేవంత్ ఢిల్లీ వేదికగా ప్రకటించారు. రేవంత్ నిర్ణయంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం.. చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అని రేవంత్ను సూటిగా ప్రశ్నించారు. ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన అని మండిపడ్డారు.
కాకతీయ కళాతోరణం, చార్మినార్ అనేవి రాచరికపు గుర్తులు కాదు.. వెయ్యేళ్ల సాంస్కృతి వైభవానికి చిహ్నాలు అని పేర్కొన్నారు. అవి వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు అని కేటీఆర్ గుర్తు చేశారు. జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ? “కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్ప. గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్”. వీటిన్నంటిని అధికారిక గీతంలో కీర్తించి.. అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు.. రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా..? గత పదేళ్లుగా.. ప్రభుత్వ అధికారిక చిహ్నంపై.. యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది. సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉంది. రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో.. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించం అని కేటీఆర్ అన్నారు. పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా… మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం..! తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం..! అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి గారు..
ఇదేం రెండునాల్కల వైఖరి..!
ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన..!!మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం..!
చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు..!!అవి రాచరికపు గుర్తులు కాదు..!
వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు..!!
వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు… pic.twitter.com/LZ4DzRnPOq— KTR (@KTRBRS) May 28, 2024