KTR | హైదరాబాద్ : నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాలను పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణతో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలకు శాపంగా పరిణమిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసిన ఆందోళనలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని కేటీఆర్ తెలిపారు.
దేశ సంక్షేమం కోసం జనాభా నియంత్రణను ఒక యజ్ఞంలా భావించి, దాన్ని విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శిక్షించాలని చూస్తోందా అని కేటీఆర్ ప్రశ్నించారు. “జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు చేసిన కృషిని పట్టించుకోకుండా, కేవలం జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించడం ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం” అని ఆయన మండిపడ్డారు.
దక్షిణాది రాష్ట్రాలు దేశ నిర్మాణంలో అందించిన సహకారాన్ని ఎవరూ కాదనలేరని ఆయన అన్నారు. “1951లో దక్షిణాది రాష్ట్రాల జనాభా వాటా 26.2 శాతం ఉండగా, 2022 నాటికి అది 19.8 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తర రాష్ట్రాల జనాభా వాటా 39.1 శాతం నుంచి 43.2 శాతానికి పెరిగింది. ఈ పరిస్థితుల్లో జనాభా ఆధారంగా లోక్సభ సీట్లను నిర్ణయిస్తే, ఉత్తరప్రదేశ్ మరియు బిహార్లకు కలిపి 222 సీట్లు వస్తాయి, అయితే ఐదు దక్షిణాది రాష్ట్రాలకు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ) కలిపి కేవలం 165 సీట్లు మాత్రమే లభిస్తాయి” అని కేటీఆర్ వివరించారు.
“దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక వృద్ధి, మానవ అభివృద్ధి సూచికలు, జనాభా నియంత్రణ వంటి అన్ని రంగాల్లో ఉత్తర రాష్ట్రాల కంటే గణనీయంగా మెరుగైన పనితీరు కనబరిచాయి. అలాంటి రాష్ట్రాలను శిక్షించి, వెనుకబడిన రాష్ట్రాలను ప్రోత్సహించడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా కంటే ఆర్థిక సహకారాన్ని ప్రాతిపాదికగా తీసుకోవాలని కేటీఆర్ ప్రతిపాదించారు. “తెలంగాణ జనాభా దేశ జనాభాలో కేవలం 2.8 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దేశ జీడీపీలో 5.2 శాతం కంటే ఎక్కువ సహకారం అందిస్తోంది. ఇదే విధంగా దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు అపారమైన సహకారం అందిస్తున్నాయి. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజనలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి” అని కేటీఆర్ సూచించారు.