KTR | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి దేవస్థాన భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను, పక్కా భవన నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణ అధికారిణి (ఈవో)పైనా, 30 మంది సిబ్బందిపైనా ఆ గ్రామస్తులు మంగళవారం కర్రలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. భద్రాద్రి ఆలయ ఈవోపై దాడి జరిగిన ఘటనపై బీజేపీ రాచమంద్రా నోరు తెరవరేం..? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాములోరి భూములను ఆక్రమించుకుంటోంటే మాటైనా మాట్లాడరేం? మీ భాగస్వామి ప్రభుత్వం చెరలో ఉన్నాయని వదిలేస్తున్నారా? లేక ఈసారి మొత్తం భద్రాద్రినే గంపగుత్తగా వారి చేతిలో పెడదామనుకుంటున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఓట్ల కోసమే చేసే మీ రామజపాలను, సీట్ల కోసమే వేసే మీ దొంగ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మోదీతో మాట్లాడతారో, మీ దోస్తు దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం.. భద్రాద్రిని కాపాడండి.. ఆక్రమణల చెర నుంచి విడిపించండి అని కేటీఆర్ పేర్కొన్నారు.