KTR | కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వాస్తవ, అవాస్తవాలపై పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ రూపొందించిన కరపత్రాన్ని సిరిసిల్లలో ఆయన బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ… ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ను కూల్చేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను తొలగించి మరమ్మతులు చేసి ప్రాజెక్ట్ను పునరుద్దరించాల్సిన ప్రభుత్వం అసత్య ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే కుట్ర పన్నుతోందని విమర్శించారు.
ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రాజెక్ట్గా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఏర్పడిన చిన్న చిన్న సాంకేతిక లోపాలను భూతద్దంలో చూపిస్తూ ప్రాజెక్ట్ ప్రతిష్టను కాంగ్రెస్ మంటగలుపుతోందని కేటీఆర్ విమర్శించారు. ఓట్ల కోసం రైతుల నోట్లో మట్టిగొట్టే పనులు మానుకోవాలని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై నిజానిజాలను ప్రజలకు వివరించేందుకు మార్చి ఒకటిన ఛలో కాళేశ్వరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మంథని బీఆర్ఎస్ ఇంచార్జ్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వాస్తవ, అవాస్తవాలను వివరిస్తూ రూపొందించిన ఈ కరపత్రాన్ని చదివితే పూర్తిగా అవగతమవుతుందని తెలిపారు. పార్టీ శ్రేణులు కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్ సాగిస్తున్న కుట్రలను ప్రజలకు కూలంకషంగా వివరించి తిప్పికొట్టాలని కోరారు.