KTR | కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ ‘నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపించింది. వర్షాలు బాగాపడ్డాయని ఒకాయన.. బోర్వెల్స్ పెరిగాయని ఒకాయన. రైతులు బోర్వెల్స్ ఎప్పుడు వేస్తరు? భూగర్భజలాలు పెరిగితేనే కదా? భూగర్భజలాలు పెరుగకపోతే కొత్త బోర్లు వేస్తరా? భూగర్భ జలాలు పెరిగినయ్.. చెరువులు నిండినయ్. వాగులు నిండినయ్ కాబట్టే ఇవాళ ఈ జలవిజయాలు కాళేశ్వరం పుణ్యం అనే మాట నేను రైతులకు చెబుతున్నా. కాళేశ్వరం కింద ఉండే బరాజ్లు, రిజర్వాయర్లు నిండిన ఫలితం.. భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగిన ఫలితం’ అని తెలిపారు.
‘కాళేశ్వరంలో భాగంగా మిడ్ మానేరు జంక్షన్గా మారిన మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. ఈ విషయాన్ని లాల్ బహదూర్శాస్త్రి నేషనల్ అకాడమీ తెలిపింది. యువ ఐఏఎస్లకు పాఠాలు చెబుతారో.. వాటర్ కాన్జర్వేషన్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు క్లాసిక్ ఎగ్జాంపుల్ అని పాఠాలుచెప్పే స్థాయికి కాళేశ్వరం ద్వారా సాధించిన విజయం, రిజిస్టర్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కాళేశ్వరంతో పాతాళగంగ పైకి వచ్చింది. హైదరాబాద్కు మంచినీళ్ల కరువు అనే లేకుండా భరోసా ఇచ్చిన అమృత వాహిని కాళేశ్వరం. దీనిపై ఇవాళ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నరు. అసెంబ్లీలో రిపోర్టు పెట్టారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం లేదు. కాస్ట్ బెనిఫిట్.. బెనిఫిట్ టూ కాస్ట్, వయోబులిటి అని మాట్లాడితే అర్థం ఉంటుంది. తెలంగాణలో ప్రత్యామ్నాయం లేదు. నీళ్లు కావాలంటే ఎత్తిపోయాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. పబ్లిక్ యుటిలిటీ.. లక్షల, కోట్ల మంది ప్రజలకు సంబంధించిన జీవితాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు.. ఇవాళ కొందరు మాట్లాడే మాటలు.. వయోబులిటి ఉందా? లేదా? పాయింట్ ఏంటంటే.. కాళ్లు అడ్డం పెడితే నీళ్లు వచ్చే పరిస్థితి తెలంగాణలో లేదు’ అన్నారు.
‘ప్రాజెక్టులు కట్టి ఎత్తిపోసుకుంటే మన బీళ్లకు నీళ్లు రావు.. ఇది వాస్తవం. మన భౌగోళిక పరిస్థితి అలా ఉంది. అందుకే ఎంత ఖర్చయినా సరే.. ఎత్తిపోతలే శరణ్యం తప్ప.. తెలంగాణకు వేరే మార్గం లేదు. ఉదాహరణకు గల్ఫ్ దేశాలను తీసుకుంటే.. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యూఏఈలో తాగునీరు లేదు. తాగునీరు లేదని ఊరుకోం కదా? సముద్రం నీళ్లు ఉన్నయ్. వాటిలో ఉప్పును డిసాలినేషన్ చేసి.. ఎంత ఖర్చయినా మంచినీళ్లు తాగాల్సిందే తప్పా.. వేరే మార్గం లేదు కదా? వయోబులిటీ లేదు.. కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే డిసాలినేషన్ ప్లాంట్ పనికిరాదు అంటే నీళ్లు లేక సచ్చిపోతరు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. బీళ్లుగా మారిన తెలంగాణ పొలాలు.. దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమాలు.. తెలంగాణలో రైతులకు జరిగిన అన్యాయం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని.. ఎంత ఖర్చయినా సరే ఎత్తిపోతలే శరణ్యమని ఒక కామన్ సెన్స్ ఉండెకాబట్టే.. ఇంజినీర్లు చెప్పారు కాబట్టే మనం ఎత్తిపోతల పథకాలు చేసుకున్నాం. దశాబ్దాల పాటు కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణకు ఉపశమనం లభిస్తే దాన్ని దేనితో విలువ కడుతరు? ఏ రకంగా లాభంపై అధ్యయనం చేస్తరు? కాకి లెక్కలు వేసి మాట్లాడితే సరిపోదు కదా? దశాబ్దాల పాటు తెలంగాణ జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీచేయాలి? ఒక మూషంపల్లిలో బోర్ల రాంరెడ్డి 54 బోర్లకు పెట్టిన ఖర్చు ఎవరి ఖాతాలో వస్తారు ? దాని వయోబిలిటీ ఏంది? కాస్ట్ బెనిఫిట్ మాటకే వస్తే దేశంలో ప్రభుత్వ హాస్పిటల్స్ కట్టకూడదు. అందులో వయోబులిటీ కనపడదు. ఐఐటీలు కట్టకూడదు. ఐఐఎంలు పెట్టకూడదు. వయోబులిటీ రాదు. ప్రైవేటు కాలేజీలతో ఫర్ ప్రాఫిట్. ప్రభుత్వం ప్రాఫిట్ ఫర్ ఇన్స్టిట్యూషన్’ అన్నారు.
‘అత్యంత పేదరికంలో ఉన్న రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్టులను ఇవాళ కాస్ట్ బెనిఫిట్ అనే కొలమానంతో చూడడం సరికాదు. ఇవాళ ఎవరైతే కాళేశ్వరాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నరో.. కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ అని.. వారందరికీ చేసే విజ్ఞప్తి.. ఆకలికేకల తెలంగాణ ఇవాళ అన్నంగిన్నెగా మారిన మాట వాస్తవం కాదా? దేశానికి అన్నపూర్ణగా మారిన మాట వాస్తవం కాదా? 24లక్షల టన్నుల ధాన్యం సేకరించే తెలంగాణలో ఇవాళ 3.50కోట్ల టన్నుల ధాన్యం పండుతున్న మాట వాస్తవం కాదా? తెలంగాణ భారతదేశానికే ధాన్య భాండాగారంగా మారిన మాట వాస్తవం కాదా? ఎఫ్సీఐ ప్రొక్యూర్మెంట్ లెక్కుల కాళేశ్వరం సాధించిన విజయానికి. ఆనాడు ఎకరం రూ.3లక్షల పలుకని భూముల ధర.. నేడు రూ.30లక్షలు అయ్యింది వాస్తవం కాదా? ఇది మ్యాజిక్తో అయ్యిందా? నీళ్లు రాకుండానే.. పంటలు పండకుండానే భూముల ధరలు పెరిగాయా ?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
‘సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు రేవంత్రెడ్డి.. ఉత్తమ్కుమార్రెడ్డి. రూ.93వేలకోట్లు ఖర్చు పెట్టి 90వేల ఎకరాలకు అని మాట్లాడుతున్నరు. ఎస్సారెస్పీ కట్టిన తర్వాత 11 సంవత్సరాలకు 25వేల ఎకరాలకు నీరిచ్చింది కాంగ్రెస్. నాగార్జున సాగర్ కట్టిన 12 సంవత్సరాల తర్వాత 98వేల ఎకరాలకు నీరు వచ్చింది. కల్వకుర్తి ప్రాజెక్టులో 30 సంవత్సరాల తర్వాత 13వేల ఎకరాలకు నీరు వచ్చాయి. ఇవాళ కాళేశ్వరంలో మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు. కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీలు. ఈ రెండింటితోనే రెండు పంటలు పంటలు కలుపుకుంటే.. 13లక్షల ఎకరాలకు నీరిచ్చే పరిస్థితి ఉంది. మేం రిజర్వాయర్లు కట్టాం.. మీరు ప్రవాహ కాలువ, డిస్ట్రిబ్యూషన్ కాలువలు కడితే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వొచ్చు’ అన్నారు.
‘ఏనుగెళ్లింది.. తోక చిక్కింది అన్నటు.. అసలు మేం చేశాం.. మీరు చేయాల్సింది కొసరు పని. దాన్ని చేయకుండా బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారో.. వారిని ఆలోచించమని కోరుతున్నా. ఇన్ని తప్పుడు లెక్కలు చెప్పినా.. మొన్న రాష్ట్ర ప్రభుత్వమే శాసనసభలో ఇచ్చిన నివేదిక చూస్తే 20లక్షల ఎకరాలకు నీరు వచ్చాయని చెప్పారు. స్థిరీకరణ, కొత్త ఆయకట్టు చూస్తే 20లక్షల ఎకరాలకు నీరిచ్చామని ఒప్పుకున్న పరిస్థితి. ఛలో మేడిగడ్డ కార్యక్రమం తీసుకున్నాం. మార్చి 1న ఉదయం 8.30గంటలకు పార్టీ శాసనసభ్యులు, మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తాం. మొదటి రోజు మేడిగడ్డ వెళ్తాం. ఆ తర్వాత తెలంగాణ కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా తెలంగాణ ప్రజలకు మరోసారి ఆవిష్కృతం చేస్తూ.. వాళ్ల మనసులో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ.. కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు.. ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకెళ్తాం’ అని కేటీఆర్ అన్నారు.