KTR | సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం ‘నీళ్ల సారు’ ఆర్ విద్యాసాగర్ రావు చేసిన కృషి అసామాన్యమని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జల దోపిడి గురించి, తెలంగాణకు జరిగిన నష్టం గురించి వివరించి ప్రజలను చైతన్యపరచడంలో విద్యాసాగర్ రావు సేవలు చిరస్మరణీయమని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ఆహ్వానంతో విద్యాసాగర్ రావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా సేవలందించారని.. అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో విలువైన సలహాలు, సూచనలు అందించారని కేటీఆర్ అన్నారు. విద్యాసాగర్ రావు మరణం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం, ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా డిండి ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టిందని తెలిపారు. విద్యాసాగర్ రావు జన్మస్థలం జాజిరెడ్డిగూడెంలో ఆయన పేరు మీద ఒక సబ్మార్కెట్ యార్డును నిర్మించిందన్నారు.