KTR | హైదరాబాద్/సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి వచ్చిన రాహుల్గాంధీ నిర్మల్ సభలో పచ్చి అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.2,500, పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని దుయ్యబట్టారు. రాహుల్గాంధీ అమాయకుడు అని, ఇక్కడి కాంగ్రెస్ నేతలు రాసిచ్చింది చదివారని పేర్కొన్నారు. అసలు రేవంత్రెడ్డి ఎన్నికలు అయ్యాక కాంగ్రెస్లో ఉంటాడో, ఉండడో చూసుకోవాలంటూ రాహుల్గాంధీకి హితవు పలికారు. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థి టీ పద్మారావుగౌడ్కి మద్దతుగా ఆదివారం ఆయన ఎల్బీనగర్, ఉప్పల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో రోడ్షో నిర్వహించారు. కర్మన్ఘాట్, ఉప్పల్క్రాస్రోడ్, ముషీరాబాద్, రాంనగర్ క్రాస్రోడ్లో జరిగిన కార్నర్ మీటింగ్ల్లో ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసి రాహుల్గాంధీ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. జనవరి నుంచి ఒక్కో మహిళకు రూ.10 వేలు, పింఛన్దారులకు రూ.16 వేలు, లక్షన్నర ఆడబిడ్డలకు లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నారని పేర్కొన్నారు. రాహుల్గాంధీ చౌకీదార్ చోర్ అంటే, రేవంత్రెడ్డి మోదీ బడే భాయ్ అంటున్నాడని ఎద్దేవా చేశారు. అదానీకి సింగరేణి, ఇతర సంస్థలు కట్టబెట్టేందుకు రేవంత్రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి నాలుగు నెలల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచినందుకు ప్రధాని మోదీని ప్రజలు పిరమైన ప్రధాని అంటున్నారని ఎద్దేవా చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దమ్ముంటే హైదరాబాద్కు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజల ముక్కు పిండి రాష్ర్టాలకు వాటా దక్కకుండా సెస్ వేసి రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. వీటిలో రూ.14 లక్షల కోట్లు అదానీ, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేశారని దుయ్యబట్టారు. తాను చెప్పింది అబద్ధమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి ఒక్క రూపాయి కూడా హైదరాబాద్కు ఖర్చు పెట్టలేదని విమర్శించారు. పదేండ్లలో ఎస్సార్డీపీ కింద బీఆర్ఎస్ ప్రభుత్వం 36 ప్రాజెక్టులు పూర్తి చేసిందని, కానీ మోదీ ప్రభుత్వం నారపల్లి, అంబర్పేట ఫ్లై ఓవర్లు కట్టలేకపోయిందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్గుప్తా, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు సలీం, శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
‘కేటీఆర్.. చీర కట్టుకుని బస్సెక్కి చూడు.. గ్యారెంటీలు అమలవుతున్నాయో.. లేదో’ తెలుస్తుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అదే స్థాయిలో ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘రేవంత్రెడ్డీ.. చీర నువ్వు కట్టుకుంటావా? లేక రాహుల్గాంధీకి కట్టిస్తావా? మహిళలకు నెలకు రూ.2,500 ఎక్కడిస్తున్నారో చూపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా? తెలంగాణాలో ఉన్న ఒక కోటీ 67 లక్షల మంది 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్ను బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలేనని హెచ్చరించారు. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం, చేసేదేమో సోనియమ్మ జపం, మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సరారు పూర్తి వైఫల్యం అని దుయ్యబట్టారు.
‘కేసీఆర్ కిట్ ఆగింది. న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. కల్యాణలక్ష్మి నిలిచింది. తులం బంగారం అడ్రస్ లేదు. ఫ్రీ బస్సు అని బిల్డప్. అందులో సీట్లు దొరకవు. అన్నింటినీ అటకెకించిన కాంగ్రెస్కు మహిళల ఓట్లడిగే హకు లేదు. చిల్లర మాటలు, ఉద్దెర పనులు తప్ప నువ్వు, నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమీ లేదు అని అందరికీ తెలిసిపోయింది’ అని పేర్కొన్నారు. ఈ పోస్టుకు ‘నెలకు ప్రతినెలా మహిళల అకౌంట్లో రూ.2,500 ఇస్తున్నాం’ అని రాహుల్గాంధీ చెప్పిన వీడియోను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్కు నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన వస్తున్నది. గంటల వ్యవధిలోనే ఈ పోస్టుకు వేలాదిగా వ్యూస్, కామెంట్లు వస్తున్నాయి. ‘అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి.. నేటివరకూ అబద్ధాలు చెప్తున్న రేవంత్రెడ్డి చీర కట్టుకోవాలి’ అని నెటిజన్లు కామెంట్ చేశారు.