వరంగల్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికలు మొనగాడు సీఎం కేసీఆర్, మోసగాళ్లు కాంగ్రెస్, బీజేపీ మధ్యేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చెప్పారు. తెలంగాణకు అవసరమైన అన్నీ చేసిన కేసీఆర్ మనకు ఉన్నారని, ఇంకొకరి అవసరం ఏమున్నదని అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్, పోలీస్ కాంప్లెక్స్, పేదల డబుల్ బెడ్రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు. అనంత రం భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో జరిగిన బీఆర్ఎస్ బహిరంగసభల్లో ప్ర సంగించారు. ‘విద్య, వైద్యం, ఎవుసం, పల్లె, పట్నం, తాగునీరు, సాగునీరు, కరెంటు.. ఇలా ఏ రంగంలో అయినా తెలంగాణకు అవసరమైన ప్రతిదాన్ని సీఎం కేసీఆర్ పూర్తి చేశారు.
కేసీఆర్ లాంటి దమ్మున్న నా యకుడితోనే దళితబంధు వంటి పథకాలు సాధ్యం. కేసీఆర్కు సాటి, పోటీ అయినవారు రాష్ట్రంలో ఎవ రూ లేరు. కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీ సీఎం అభ్య ర్థి ఎవరో చెప్పాలి. సావునోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు, డబ్బుమూటలు, నోట్ల కట్టలతో దొరికిన రేవంత్రెడ్డి పోటీనా? అన్నది ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ అభివృద్ధి ఇలాగే ముందుకు పోవాలంటే ఎన్నికల్లో గులాబీ జెండా మళ్లీ ఎగరాలె. తొమ్మిదిన్నరేండ్ల కిందట తెలంగాణ ఎట్లుండె? ఇ ప్పుడు ఎట్లున్నది? అప్పుడు భూపాలపల్లి, పరకాల, తొర్రూరు ఎట్లుండె? ఇప్పుడెట్లున్నది? నీళ్లు ఇయ్యకపోతే ఓట్లు అడగనని ప్రకటించిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ తప్ప ఎవరన్న ఉన్నరా? ఇంటింటికి వ స్తున్న నల్ల నీళ్లల్ల కేసీఆర్ కనిపిస్తున్నడు’ అని తెలిపారు.
కాంగ్రెస్కు అవకాశం ఇస్తే ఏడాదికో ముఖ్యమంత్రి వస్తడు. కుంభకోణాల కుంభమేళా కొనసాగుతది.
ఇప్పుడు వచ్చి మాటలు చెప్పేటోళ్లను నమ్మితే మన వేలితో మన కండ్లనే పొడుస్తరు. రైతుబంధుకు రాంరాం అంటరు. దళితబంధు జైభీం అంటరు.
తెలంగాణపై, తెలంగాణ ప్రజలపై కేసీఆర్కు ప్రేమ ఉన్నట్టు నరేంద్ర మోదీకి, రాహుల్ గాంధీకి ఎందుకు ఉంటుంది? ఎన్నికలు అనంగనే వచ్చి ఆగంజేస్తరు.
కేసీఆర్ మూడోసారి సీఎం అయితే దేశమంతటా చర్చ జరుగుతది. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీని శాసించే శక్తి అయితది.
– మంత్రి కేటీఆర్
సర్కారు దవాఖానల్లో కాన్పులు పెరిగినయ్
‘కాంగ్రెస్ హయాంల సర్కారు దవాఖానకు నేను పోను అని సినిమా పాటలు తయారు చేసిండ్లు. ఇప్పుడు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, 500 పడకల దవాఖాన కట్టుకున్నం. గుండె జబ్బు, కిడ్నీ, క్యాన్సర్ ఏ సమస్య వచ్చినా ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నరు. ఇదంతా కేసీఆర్ ఘనత కాదా? సర్కారు దవాఖానల్లో కాన్పులు 40 నుంచి 70 శాతానికి పెరిగినయ్. పేద విద్యార్థులకు మంచి సదువుల కోసం వెయ్యిన్నొక్క గురుకులాలను సీఎం కేసీఆర్ ప్రారంభించిండు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.1.20 లక్షలు ఖర్చు పెడుతున్నది. తొమ్మిదిన్నరేండ్ల అభివృద్ధి, సంక్షేమం కండ్ల ముందున్నది. ఊర్లె మీ దోస్తులకు, మీ ఇంట్లో వాళ్లకు ఇదే చెప్పాలి. 60 ఏండ్లు మనల్ని అన్ని విధాలుగా గోసపెట్టిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలె’ అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
11 చాన్సులిచ్చినా ఏం చేసిండ్రు?
‘కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వచ్చి ఒక్క చాన్స్ అని అడుగుతున్నరు. తెలంగాణ ప్రజలు గతంలోనే 11 సార్లు ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఆ పార్టీ రాష్ట్రంలో 55 ఏండ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేదు. ఇప్పుడు అన్ని చేస్తామని చెప్తున్న ఆ పార్టీ నేతలు గతంలో ఎందుకు చేయలేదు? కేసీఆర్ 14 ఏండ్లు ఉద్యమం చేసిండు. సావునోట్లో తలబెట్టి రాష్ట్రం సాధించిండు. కాంగ్రెస్కు విధిలేక, దిక్కులేక, ప్రజలు కొట్టి సంపుతరని తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్గాంధీని ముద్దపప్పు అని రేవంత్రెడ్డి తిట్టిండు. ఎటుపడితే అటు నాలుక తిప్పే థర్డ్ రేట్ దొంగ, క్రిమినల్. కాంగ్రెస్లో ఇప్పుడు సీటుకు ఒక రేటు అనేది నడుస్తున్నది. అప్పుడు ఓటుకు నోటు నడిపింది ఈయనే. ఇప్పుడు రాష్ట్రం ఆయనను రేవంత్రెడ్డి అంటలేరు. రేటెంతరెడ్డి అంటున్నరు’ అని కేటీఆర్ విమర్శించారు. బీజేపీకి గుజరాత్ నుంచి అదానీ, కాంగ్రెస్కు కర్ణాటక నుంచి పైసలు వస్తయని ఆరోపించారు. ఏ పార్టీ వాళ్లు ఇచ్చినా పైసలు తీసుకోవాలని, మోసాన్ని మోసంతోనే జయించి మన కోసం పనిచేసే బీఆర్ఎస్కు ఓటు వేయాలని అన్నారు.
సర్దార్ పాపన్న విగ్రహం ఆవిష్కరించి వస్తుంటే కమలమ్మ అనే పెద్దామె బొట్టు పెట్టింది. మీ నాయన ఆరోగ్యం ఎట్లున్నది? ఎప్పుడు వస్తడు? అని అడిగింది. జరం తక్కువైంది అన్ని తయారు చేస్తున్నడని చెప్పిన. ఆసరా పింఛను పెంచుడు గురించి ప్రకటిస్తరని చెప్పిన. త్వరలోనే అన్నింటిపై సీఎం కేసీఆర్ స్వయంగా అందరికీ చెప్తరు. ఇప్పుడు అందరి లెక్కాపత్రాలు రాస్తున్నరు. పులి రేపోమాపో బయటికి వస్తది. నక్కలన్నీ మళ్ల తొర్రలకు పోతయి.
– మంత్రి కేటీఆర్
ప్రజలపై విశ్వాసం ఉన్నది
భూపాలపల్లి జిల్లా సమీకృత జిల్లా అధికారుల సముదాయ భవనం, పోలీసు కాంప్లెక్సును ప్రారంభించిన అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ‘జీవితాంతం తెలంగాణ కోసం, రాష్ట్ర సాధన కోసం పరితపించిన జయశంకర్ సారు పేరుతో ఏర్పాటు చేసిన భూపాలపల్లి జిల్లా సమీకృత అధికారుల కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశం రావడం నిజంగా గొప్ప అదృష్టం. ఇది నా పూర్వ జన్మ సుకృతం. పుట్టుకు నీది, చావు నీది, బతుకంతా తెలంగాణ అన్నట్టు కృషిచేసిన మహానాయకుడు జయశంకర్ సార్. ఆయన కోరుకున్నట్టు తెలంగాణ ఉంటున్నది. జయశంకర్ సారు పేరుతో యూనివర్సిటీ పెట్టుకున్నం. ఆయన పేరును జిల్లాకు పెట్టుకున్నం.
ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ఎత్తిపోతల పథకం ఎక్కడున్నదని అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అని గర్వంగా చెప్పుకోకునేలా సీఎం కేసీఆర్ పని చేసిండు. ప్రతి జిల్లాలో అత్యాధునిక వసతులతో జిల్లా అధికారుల, పోలీసు కార్యాలయాలను నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించటం గొప్ప విషయం. ఇతర రాష్ర్టాల వారు, సందర్శకులు ఇక్కడికి వచ్చినప్పుడు మన కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను చూస్తున్నారు. వాళ్ల రాష్ర్టాల్లో సచివాలయం మన జిల్లా కలెక్టరేట్ ఉన్నట్టుగా లేదని చెప్తున్నరు. తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి జరుగుతున్నది. పల్లె ప్రగతికి దేశంలో ప్రతిసారి 30 శాతం అవార్డులు మన రాష్ర్టానికే వస్తున్నాయి. పంచాయతీకార్యదర్శి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, సర్పంచ్ నుంచి సీఎం వరకు అందరి కృషితోనే ఇది సాధ్యమవుతున్నది. ఎన్నికల కోడ్ అనగానే కొందరు హడావుడిగా ఉన్నరు. నాకైతే ఎలాంటి టెన్షన్ లేదు. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు పూర్తి అవగాహన ఉన్నది. ప్రజలు పని చేసే ప్రభుత్వాన్ని తప్పక ఆదరిస్తారనే విశ్వాసం నాకు ఉన్నది. ఎన్నికల తర్వాత ఇదే చోట మళ్లీ కలుద్దాం’ అని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం తపించే నాయకుడు కేసీఆర్ ఒక్కరే. పొరపాటున మరొకరి చేతిల పెడితే రాష్ట్రం ఆగమైతది. తెలంగాణ కోసం కోట్లాడి, అభివృద్ధి చేసే దమ్ము, ధైర్యం, సాహసం, విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ మాత్రమే. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు వచ్చి ఏదేదో మాట్లాడుతరు. తెలంగాణ కోసం వాళ్లు ఏం చేసిండ్రని ఆ రెండు పార్టీల నాయకులను ప్రజలు అడగాలె.
– మంత్రి కేటీఆర్
తెలంగాణ ఇస్తమని మాట ఇచ్చిన కాంగ్రెస్ 2004లో అధికారంలోకి వచ్చింది. 2014 దాకా మోసం చేసింది. వెయ్యి మంది సావుకు కారణమైంది. తెలంగాణ ఇయ్యక సంపిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు అదే పార్టీ అమరవీరులకు సంతాపం అని అంటున్నది. సంపినోళ్లు సంతాపం చెప్తరా?
– మంత్రి కేటీఆర్
పల్లెల్లో ఆర్థిక ప్రగతి
రాష్ట్రంలో ప్రతి ఊరు సమగ్రంగా అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్రావు చేసిన కృషితోనే ఇది సాధ్యమైందని మంత్రి కేటీఆర్ చెప్పారు. భూపాలపల్లి ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి దయాకర్రావును 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమాల్లో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు శంకర్నాయక్, జెడ్పీ చైర్పర్సన్లు గండ్ర జ్యోతి, జక్కుల శ్రీహర్షిణి, పుట్ట మధుకర్, అంగోతు బిందు, కార్పొరేషన్ల చైర్మన్లు కే వాసుదేవరెడ్డి, ఎన్ సుధాకర్రావు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పాల్గొన్నారు.
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతయని, డిసెంబర్ 3న రిజల్ట్ ఇప్పుడే తెలిసింది. లెక్కలన్నీ మంచిగ కలిసినయి. మూడు ప్లస్ మూడు మన సార్ లక్కీ నంబర్ ఆరు. అట్లనే మూడు, మూడు.. మూడోసారి కేసీఆర్ పక్కా సీఎం. ఇదే జరగబోతున్నది.
– మంత్రి కేటీఆర్
వచ్చేది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు. సీఎం ఎవరనేది తేల్చుకొనేది. కేసీఆర్కు సాటి, పోటీ అయినవారు ఎవరున్నరు? తమ సీఎం అభ్యర్థి ఎవరో కాంగ్రెస్, బీజేపీ చెప్పాలి. సావునోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు.. డబ్బుమూటలు, నోట్ల కట్టలతో దొరికిన రేవంత్రెడ్డి పోటీనా?
– మంత్రి కేటీఆర్