KTR | ప్రజల కష్టసుఖాలు వింటాం.. అండగా నిలబడతామని అధికారం అందిన వారం రోజుల పాటు హడావుడి చేసిన ప్రజాదర్బార్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది. దరఖాస్తులు స్వీకరించడమే తప్ప.. వాటికి స్పందన ఏమీ లేదని తెలుస్తోంది. ప్రజా దర్బార్లో చెప్పుకుంటే తన సమస్య తీరుతుందని కొండంత ఆశతో.. వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ వచ్చిన ఇల్లెందు పట్టణానికి చెందిన అన్నపూర్ణ అనే మహిళకు ఇలాగే నిరాశే మిగిలింది. సమస్యలు తీరక బాధతో వెనుదిరిగిన ఆమెకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడింది. అన్నపూర్ణ కష్టాల గురించి విని చలించిపోయిన కేటీఆర్.. ఆమె కూతురు నర్సింగ్ చదువు కోసం లక్ష రూపాయల ఆర్థికసాయం అందజేశారు. బంజారాహిల్స్లోని తన ఇంటికి పిలిపించుకుని మరీ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ.. పత్రికల్లో, టీవీలలో ప్రజా దర్బార్ ప్రచార ఆర్భాటాన్ని చూసి నాలుగు సార్లు దరఖాస్తు ఇచ్చానని తెలిపింది. దరఖాస్తు తీసుకోవడం మినహా ఇంకా ఏ సమాచారం కానీ స్పందన కానీ ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఆర్థిక కష్టాలు, పిల్లల చదువుల కోసం పడుతున్న ఇబ్బందుల గురించి వివరించినా.. ప్రజా దర్బార్లో ఊరట దక్కలేదని వాపోయింది. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ప్రజాదర్బార్లో నాలుగు సార్లు దరఖాస్తులు పెట్టుకున్నా దయ తలచలేదని చెప్పింది. అసెంబ్లీ వద్దకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రోజంతా కాపలా కాస్తే పోలీసులు పొమ్మన్నారని తెలిపింది.
అయితే అక్కడ ఉన్న కొందరు తెలంగాణ భవన్కు వెళ్లి కేసీఆర్, కేటీఆర్ను కలిస్తే కొండంత అండ దొరుకుతుందని సలహా ఇచ్చారని పేర్కొంది. వాళ్ల మాట విని తెలంగాణ భవన్కు వెళ్లి కేటీఆర్ను కలిశానని చెప్పింది. తన బాధలు విన్న కేటీఆర్.. వ్యక్తిగత స్థాయిలో లక్ష రూపాయల ఆర్థికసాయం అందించారని అన్నపూర్ణ సంతోషం వ్యక్తం చేసింది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కష్టసుఖాలు వినడానికి… సాధ్యమైనంత వరకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపింది.