KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ విధానాలపైన, నిరంకుశ పాలనపైన, హామీలను ఎగవేసిన మోసపూరిత ప్రభుత్వ తీరుపైన మన పోరాటం కొనసాగిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పోయిన ఏడాది పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలను ఎండగట్టిన పార్టీ శ్రేణులకు ఒక సందేశం ఇచ్చారు. ప్రాణ సమానులైన… మన బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా.. అంటూ ప్రారంభించిన కేటీఆర్, గత ఏడాది పాట చేసిన పోరాటాలను నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే రానున్న రోజుల్లోనూ కాంగ్రెస్ మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దెధించేదాకా పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు.
గత ఏడాది కాలంగా ఈ కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులందరూ కనబరిచిన పోరాట స్ఫూర్తికి పేరుపేరునా ప్రతి ఒక్కరికి శిరస్సువంచి సలాం చేస్తున్నా. గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా.. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు కనబరిచిన కదనోత్సాహం.. రాష్ట్ర స్థాయిలో పని చేసే నాయకత్వంలో కూడా మాటలకందని స్థాయిలో కొండంత స్ఫూర్తి నింపిందని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ గ్రామ గ్రామాన ఉన్న.. గులాబీ సైనికులు రాష్ట్ర ప్రజలపక్షాన.. విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారనీ, అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన ఈ తుగ్లక్ పాలన వల్ల కష్టకాలంలో ఉన్న అన్ని వర్గాల పక్షాన అలుపులేని పోరాటం చేశారని అభినందించారు. ఏడాది కాలంలో పార్టీ శ్రేణులు రైతుల పక్షాన మీరు పోరాడారు, నేతన్నల గొంతుకై మీరు నిలిచారు, మహిళా సమస్యలపై మీరు గర్జించారు, బడుగు బలహీనవర్గాల ప్రజల గళమయ్యారు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన సమరభేరి మోగించారు.. నిరుద్యోగుల హక్కుల కోసం కాంగ్రెస్ సర్కారును నిలదీశారు.. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల గారడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారని కేటీఆర్ తెలిపారు.
‘మూసీలో మూటల వేట’ నుంచి ‘లగచర్ల లడాయి’ వరకూ.. అన్యాయం జరిగిన ప్రతిచోటా బాధితుల పక్షాన మీరు కొట్లాడారనీ, తెలంగాణ ప్రజల గుండెచప్పుడును అడుగుడుగునా మీరు ప్రతిధ్వనింపజేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు పార్టీ చేసిన పోరాటాలు.. చరిత్రపై చెరగని సంతకాలుగా నిలుస్తాయన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను, అత్యంత సమర్థంగా తిప్పికొట్టిన సందర్భాలు.. ఈ పోరాటపథంలో నిలిచి ఉండే మైలురాళ్లు మారాయి అని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. అసమర్థ, అనాలోచిత కాంగ్రెస్ విధానాలపై.. బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన జంగ్ సైరన్ ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించిందని కేటీఆర్ పేర్కొన్నారు.
భారత రాష్ట్ర సమితి చేసిన అలుపెరగని పోరాటాల వల్లే.. అదానీ ఆశజూపిన రూ.100 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సి వచ్చిందన్న కేటీఆర్, లగచర్ల లడాయి.. యావత్ దేశం ముందు నియంతృత్వ కాంగ్రెస్ను దోషిగా నిలబెట్టిందన్నారు. ఏడాదికాలంగా ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో నియంతృత్వ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు పెట్టినా.. ప్రభుత్వం ఎంత వేధించాలని చూసినా.. మొక్కవోని ధైర్యంతో పార్టీ శ్రేణులు నిలబడ్డ తీరు అపూర్వం, అసాధారణం, చారిత్రాత్మకం అని కేటీఆర్ ప్రశంసించారు.
దశాబ్దాలపాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను, కుక్కలు చింపిన విస్తరిలా మార్చే కాంగ్రెస్ కుట్రలను, అడుగడుగునా ప్రశ్నిద్దాం, నిలదీద్దామని పిలుపునిచ్చారు. మన పార్టీకి పునాది రాళ్లు, మన బీఆర్ఎస్కు మూలస్తంభాలు పార్టీ శ్రేణులు అని, మన గులాబీ జెండాకు.. వెన్నుముక మీరే అన్నారు. పార్టీ తరఫున నిలబడి.. కలబడే.. నేటి అలుపెరగని పోరాట యోధులే.. రేపటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై బీఆర్ఎస్ పక్షాన మెరిసే.. వజ్రాయుధాలుగా మారుతారని ఆకాంక్షించారు. ఏడాది పాటు అద్భుతమైన పోరాట పటిమ చూపిన గులాబీ సైనికులందరికీ… గుండెల నిండా… మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
BC Mahasabha | రేపు తలపెట్టిన బీసీ మహాసభకు అనుమతివ్వని పోలీసు శాఖ..!
MLC Kavitha | రైతు భరోసాకు షరతులా..? సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
Rythu Bharosa | రైతు భరోసా కోసం కొత్తగా దరఖాస్తులు..! జనవరి 14 నుంచి అమలు..!!