ఖమ్మం, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రేవంత్రెడ్డి దివాలాకోరు సీఎం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇన్నేండ్ల తన రాజకీయ అనుభవంలో ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్రెడ్డిలా దివాలాకోరు మాటలు మాట్లాడలేదని చెప్పారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, దివంగత రాయల శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన మిట్టపల్లిలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. దివంగత రాయల శేషగిరిరావు తన జీవితం మొత్తం ఈ ప్రాంత రైతుల కోసమే ధారపోశారని గుర్తుచేశారు.
పార్టీ కోసం, పేదల అభ్యున్నతి కోసం శేషగిరిరావు చేసిన సేవలను కొనియాడారు. ఢిల్లీకి పోతే దొంగల్లా చూస్తున్నారని, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, చెప్పులు ఎత్తుకుపోయేటోడిలా చూస్తున్నారని రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలను గుర్తుచేస్తూ తూర్పారబట్టారు. ‘ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన దొంగను దొంగలా చూడకుంటే దొరలా చూస్తారా?’ అంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఏం ప్రయోజనం జరిగిందో జిల్లా ప్రజలు ఆలోచించాలని కోరారు. పదేండ్లలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీరందించే అద్భుత సీతారామ ప్రాజెక్టును నిర్మించారని గుర్తుచేశారు.
ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మధిరలో బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజుపై గెలిచేందుకు అఫిడవిట్లు రాసిచ్చారని, దేవుడి దగ్గర బాండ్ పేపర్లపై సంతకాలు చేసిచ్చారని, అనేక విధాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని విమర్శించారు. 17 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిన మేలేమీ లేదని, ఉన్న పథకాలకు కూడా దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. అద్భుతమైన కేసీఆర్ కిట్టు కార్యక్రమాన్ని కూడా ఎత్తేశారని మండిపడ్డారు.
రైతులందరూ వెంటనే బ్యాంకులకు వెళ్లి పంట రుణాలు తెచ్చుకోవాలని, డిసెంబర్ 9న తొలి సంతకం రుణమాఫీ ఫైలు పైనే పెడతామంటూ రైతులకు హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి.. వారిని నిలువునా మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఆడబిడ్డల ఓట్ల కోసమే కాంగ్రెస్సోళ్లు నాడు ఫ్రీ బస్సు, తులం బంగారం అంటూ హామీలిచ్చారని విమర్శించారు. హామీల వలలో పడి ఆడబిడ్డలు మోసపోయి గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉండే గులాబీ జెండాయే తెలంగాణ ప్రజల గుండె ధైర్యమనే విషయాన్ని నిరూపించాలని సూచించారు. భద్రాచలం ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులమంతా వెళ్లి ఆ సీటును అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఏ ఎన్నిక వచ్చినా ఢిల్లీ పార్టీలను నమ్మి మోసపోవద్దని, ఇంటి పార్టీలే ముద్దు అని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రద్దు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. 17 నెలలుగా ఏ కష్టం వచ్చినా నిలబడేది బీఆర్ఎస్ పార్టీయేననే విషయాన్ని మర్చిపోవద్దని కార్యకర్తలకు సూచించారు. సభలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, బానోతు హరిప్రియా నాయక్, మెచ్చా నాగేశ్వర్రావు, బానోతు మదన్లాల్, తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ, డీసీసీబీ, సుడా, ఖమ్మం ఏఎంసీ, సత్తుపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, ఆర్జేసీ కృష్ణ, కూసంపూడి మహేశ్, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పార్టీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్కుమార్, రాయల శేషగిరిరావు కుమారులు రేవంత్, రఘునందన్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సహా పలువురు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తల్లాడ మండలం మిట్టపల్లిలో వీరందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ యాకుబ్పాషా, సుభానీ, సలీంపాషా, చాంద్పాషా, భద్రాద్రి జిల్లాకు చెందిన తోటమళ్ల బాలయోగి తదితరులున్నారు. మాజీ మంత్రి పువ్వాడ, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుల ఆధ్వర్యంలో ఈ చేరికలు కొనసాగాయి.