హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు ను ప్రస్తావిస్తూ… ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఆ పార్టీ నాయకుడు కేకే మహేందర్రెడ్డికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం లీగల్ నోటీసులు పంపించారు. ట్యాపింగ్ అంశంలో తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా, పదేపదే తన పేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాట్లాడుతున్న వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు వారికి లీగల్ నోటీసులు పంపించారు. వీరితో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ అసత్యాలు ప్రచారం చేసిన మరికొన్ని మీడియా సంస్థల కు, యూట్యూబ్ చానళ్లకు మరోసారి నోటీసులు పంపించారు. తనకు సంబంధం లేని అంశంలో తన పేరును, తమ పార్టీ పేరును ప్రస్తావిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఈ విషయం లో ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. వారం రోజుల్లోగా కొండా సురేఖ, యెన్నం శ్రీనివాస్రెడ్డి, కేకే మహేందర్రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే తదుపరి న్యాయపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.